నిన్న బాబు, నేడు లోకేష్.. తట్టుకోలేక చేతులెత్తేశారా?: రేవంతే దిక్కు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలేశారా? అనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. గతంలో చంద్రబాబు, ఆ తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో కెసిఆర్ పాలన పైన విరుచుకుపడ్డ సందర్భాలు ఎన్నో.
అయితే, ఇటీవలి కాలంలో కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్ల దూకుడు తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ కొత్త రాష్ట్రమైనందున తాను అక్కడి సమస్యలపై దృష్టి సారించాల్సి ఉందని, తెలంగాణ బాధ్యతలు మీరే తీసుకోవాలని సూచించారు.
నారా లోకేష్ మాత్రం మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్రంలోను కీలకంగా కనిపించారు. ఆ తర్వాత ఆయన దూరం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిన్న చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ దూరం పాటిస్తున్నారని, అంటే చంద్రబాబు తెలంగాణను వదిలేసినట్లేనని ఊహాగానాలు మరోసారి వినిపిస్తున్నాయి.

అందుకు మరో కారణం కూడా ఉందని అంటున్నారు. ఇటీవలి వరకు నారా లోకేష్ను కేంద్రానికి పంపిస్తారని, కేంద్రమంత్రిని చేయడం ద్వారా అటు ఏపీకి, ఇటు తెలంగాణలో టిడిపి బలోపేతానికి అతను ఉపయోగపడతారనే చర్చ జరిగింది.
టిడిపి నేతలు ఈ విషయాన్ని చంద్రబాబుకు సూచించారు. ఈ విషయంలో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారనే విషయం తెలియనప్పటికీ.. ఆ తర్వాత కేంద్రానికి పంపించే విషయంలో టిడిపి మాత్రం యూ టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
తాజాగా, ఆయనను ఏపీ కేబినెట్కు పంపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా లోకేష్ ఏపీ రాజకీయాల పైన దృష్టి సారించనున్నారనే విషయం అర్థమవుతోందని అంటున్నారు. అంటే నిన్న చంద్రబాబు, నేడు లోకేష్.. తెలంగాణను వదిలేసినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు.
ఇక, తెలంగాణలో టిడిపి బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డి భుజాల పైనే పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ కేంద్రమంత్రిగా ఉంటే తెలంగాణలో పార్టీకి హెల్ప్ అవుతుందని తెలంగాణ నేతలు కూడా భావించారు.
అయితే, ఓటుకు నోటు కేసు నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేష్ తగ్గినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు నేపథ్యంలో వరుసగా టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారు ఎక్కుతున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ హైదరాబాదులో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications