నయీమ్ కేసు: ఉమా మాధవ రెడ్డి పేరే ఎందుకు వచ్చింది?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీమ్ ఓ మాజీ మంత్రి అండదండలతోనే ఎదిగాడనే వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉమా మాధవరెడ్డి పేరునే ఊహిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో భువనగిరి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు అత్యంత దారుణంగా హత్య చేశారు.
తన భర్తను చంపారనే కక్షతోనే నక్సలైట్లపై పగ తీర్చుకునేందుకు ఉమా మాధవరెడ్డి నయీంను పెంచి పోషించారనే ప్రచారం ఊపందుకుంది. విప్లవ గాయని బెల్లి లలిత అప్పట్లో తీవ్రమైన సంచలనం సృష్టించింది. భువనగిరి ప్రాంతానికే చెందిన లలిత హత్యను అత్యంత క్రూరంగా నయీం ముఠా చంపేసింది. ఇందుకు ప్రతీకారంగానే అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు మాధవరెడ్డిని హత్య చేశారని అంటారు.

భువనగిరి నియోజకవర్గం నుంచి ఎలిమినేటి మాధవ రెడ్డి నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంల్లో ఆయన మంత్రిగా పనిచేశారు. 1995 నుంచి 19999 వరకు నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా ఆయన పనిచేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న సయమంలో మాధవరెడ్డిని పీపుల్స్వార్ నక్సలైట్లు 2000 మార్చి 7వ తేదీన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద మందుపాతర పేల్చి హత్య చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో మాధవరెడ్డి దాదాపుగా నెంబర్ టూ స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో ఆయన నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
మాధవ రెడ్డి మరణం తర్వాత ఆయన భార్య ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఉమా మాధవరెడ్డి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో పనిచేశారు. తన భర్త మాధవ రెడ్డిని హత్య చేశారనే కోపంతోనే అదే ప్రాంతానికి చెందిన మాజీ నక్సలైట్ నయీమ్ను మాధవరెడ్డి కూడా ప్రోత్సహించారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఉమా మాధవరెడ్డి కూడా నయీంకు సహకరించి ఉండవచ్చుననేది ప్రస్తుత పుకార్లకు మూలాధారం. నక్సలైట్లపై నయీంకు ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను వారు వాడుకున్నారని అంటారు.












Click it and Unblock the Notifications