వీడని నయీం భయం?: ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు!
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమైనప్పటికీ అతని బాధితుల్లో భయం మాత్రం పోవడం లేదు. నయీమ్ అనుచరుల వల్ల భవిష్యత్తులో ముప్పుంటుందేమోనని జంకుతున్నారు అతని బాధితులు.
అందువల్లే ధైర్యంగా వచ్చి ఫిర్యాదుచేయాలని సిట్ అధికారులు, పోలీసులు పిలుపునిచ్చినా నయీం బాధితుల నుంచి అంతగా స్పందన రావడం లేదని తెలుస్తోంది.
సుమారు 25ఏళ్లపాటు నయీం తన నేర సామ్రాజ్యాన్ని ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు, అప్పటి పోలీసుల సహకారంతో పాలించాడనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయీం బాధితులు అతని అనుచరులు, సదరు పోలీసుల నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నయీం ఎన్కౌంటర్ నేపథ్యంలో అతని ముఠాలోని చాలామంది ఇప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నయీంకు కోవర్టుగా, అత్యంత సన్నిహితుడిగా ఉన్న శేషన్నలాంటి కరుడుగట్టిన నేరస్తులు ఇంకా పోలీసులకు చిక్కలేదు.
నయీం బాధితుల్లో 142 మంది సిట్కు ఫోన్చేయగా, ఆరుగురు మాత్రమే వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నయీం ఎన్కౌంటర్ జరిగి పదిరోజులు కావస్తున్నా.. మంగళవారం ఒక్కరోజే 24 మంది బాధితులు సిట్ కార్యాలయానికి ఫోన్ చేశారు.

అండగా ఉంటాం: సిట్ చీఫ్ ఐజీ, నాగిరెడ్డి
నయీం బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని సిట్ చీఫ్ నాగిరెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు మాత్రం తక్కువగానే వచ్చాయని అన్నారు. సిట్ కంట్రోల్ రూంనంబర్ (9440627218)కు ఫోన్ చేస్తే, సిబ్బంది బాధితులకు పూర్తి సహకారాన్ని అందిస్తారన్నారు.
ఇది ఇలా ఉండగా, పోలీస్స్టేషన్, సీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్న నయీం బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని పూర్తి వివరాలతో వాట్సప్ (నెం. 9490617111)కు మెస్సేజ్ చేస్తే న్యాయం చేస్తామని సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.












Click it and Unblock the Notifications