కాసుల కొరత: కాళోజీ కళా క్షేత్రం, కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు గ్రహణం
కళల కాణిచిగా పేరున్న ఓరుగల్లులో కళావేదికల ఏర్పాటు ఆరంభశూరత్వమే అవుతోంది.
వరంగల్: కళల కాణిచిగా పేరున్న ఓరుగల్లులో కళావేదికల ఏర్పాటు ఆరంభశూరత్వమే అవుతోంది. స్వయంగా ముఖ్య మంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన కళాక్షేత్రాల నిర్మాణపనులకే దిక్కులేకుండా పోయింది. మరోవైపు వరంగల్లో మినీ రవీంద్రభారతిగా పిలిచే మల్లీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ సైతం నిర్మాణ థలోనే ఆగిపోయింది.
ఈ రెండు కళాక్షేత్రాల నిర్మాణాల బ్రేక్కు నిధులు కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణకు సరైన వేదికలు లేకపోవడంతో అరకొర వసతులతో ఆరుబయట నిర్వహిస్తున్నారు. వీటి నిర్మాణ పనులకు సంబంధిచి ఆర్థికభారం మోయలేకనే మధ్యలోనే పనులు నిలిపివేయాల్సి వచ్చిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ఆరంభ శూరత్వమేనా..?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వరంగల్ వచ్చినపుడు వరంగల్ ప్రజల ఉద్యమ రుణం తీర్చుకునేందుకు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నానని ప్రకటించారు. ఆచార్య జయశంకర్, ప్రముఖ కవి కాళోజీ నారాయణరావులాంటి తెలంగాణ వైతాళికుల పేరుతో వాటి నిర్మాణం చేపడుతానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ పేరును పెట్టారు.
ఇక కాళోజీ నారాయణరావు పేరుమీద ఆరోగ్య విశ్వవిద్యాలయం, భారీస్థాయిలో అధునాతన సౌకర్యాలతో కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకించారు. అధికారులంతా ఆగమేఘాల మీద అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కాళోజీ కళాక్షేత్రం నిర్వహణ బాలసముద్రంలో ప్రెస్ క్లబ్ సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశారు. 2014 నవంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా శంకుస్థాపన చేశారు. రూ. 15 కోట్లతో కళాక్షేత్రం నిర్మాణానికి సన్నాహాలు చేశారు.
అయితే నెలలు గడిచినా కళాక్షేత్ర నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. మరోసారి వరంగల్ పర్యటనకు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ కళాక్షేత్రాన్ని మరింత ఆధునిక సౌకర్యాలతో రూ. 50 కోట్లతో హయగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా పనులు సైతం ప్రాంరభమయ్యాయి. ఇప్పటి వరకు రూ. 4.5కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. ఆ తరువాతే కష్టాలు మొదలయ్యాయి. కాంటాక్టర్కు నిధులు విడుదల కాకపోవడంతో రెండు నెలలుగా పనులు నిలిచిపోయాయి.
మినీ రవీంద్రభారతికి మోక్షం లేదు..
వరంగల్ పట్టణ పరిధిలో అన్ని రకాల కళా ప్రదర్శనలకు వేదికగా ఉండేందుకు మినీ రవీంద్రభారతిలాంటి వేదికను నిర్మించాలనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోచమ్మమైదాన్ ప్రాంతంలో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ పేరుతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 4.5 కోట్ల నిధుల అంచనాతో 2013 అక్టోబర్ 11న అప్పటి మంత్రి బస్వరాజు సారయ్య శంకుస్థాపన చేశారు.
విచిత్రమేమంటే గతంలో ఇదే భవనానికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు. మూడోసారి పనులు మొదలు పెట్టినప్పటికీ పూర్తికాలేదు. పిల్లర్లు, కొన్ని చోట్ల భవనాల వరకు నిర్మాణం వరకు పనులు జరిగాయి. దాదాపు మూడేళ్లు గడిచినా మినీ రవీంద్రభారతి నిర్మాణ పనుల్లో ప్రగతి మాత్రం లేదు. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడం వల్ల నిర్మాణ పనులను కొనసాగించలేక పోతున్నారు. నిధుల విడుదలకు సంబంధించి అధికారుల ఏ మాత్రం శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు
ప్రతిష్టాత్మక కళాక్షేత్రాల నిర్మాణ పనులకు సంబంధించి జిల్లాకు చెందిన జ్రాప్రతినిధులు ఆసక్తి చూపడంలేదన్న విమర్శలున్నాయి. ప్రత్యేకంగా నిధుల విడుదల కోసం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా అనుకుంటే తప్పా నిధుల విడుదలను ప్రస్తావించే సాహసం చేయలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన అనేకరకాల అభివృద్ధి ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోవడం లేదని నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.