శశి కుమార్ మృతి కేసులో ట్విస్ట్, అదే కారణమా!: చంద్రకళ ఎవరు?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలోని నక్కలపల్లి ఫాంహౌస్లో జరిగిన డాక్టర్ శశికుమార్ మృతి పైన మరో కొత్త కోణం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. డాక్టర్లకు ఓ ఫైనాన్షియర్ పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చాడని, ఆ అప్పు నేపథ్యంలోనే వారి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది.
రెండు వారాల క్రితం హిమయత్ నగర్లో డాక్టర్ కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. డాక్టర్ శశికుమార్ మరో డాక్టర్ పైన కాల్పులు జరిపారు. ఈ కాల్పులు తాను జరపలేదని, మరో డాక్టర్ సాయి కుమార్ జరిపాడని శశికుమార్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ముగ్గురు డాక్టర్ల మధ్య గొడవ.. డబ్బుల విషయమై వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ డాక్టర్లకు ఓ ఫైనాన్షియర్ పెద్ద మొత్తంలో డబ్బిచ్చారని, దానిని వడ్డీతో సహా చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ముగ్గురు డాక్టర్ల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత కాల్పులు, అనంతరం శశికుమార్ మృతికి కారణంగా తెలుస్తోంది. కాల్పులు జరిగిన ఘటన, శశికుమార్ మృతి చెందిన ఘటన.. రెండు కూడా వేర్వేరు కమిషనరేట్ పరిధిలోకి వస్తున్నాయి. సమన్వయం చేసుకొని కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.
కాల్పులు, శశికుమార్ మృతి పైన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేశారు.. చేస్తున్నారు. శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఆయన భార్య చెప్పినట్లు ఎవరైనా హత్య చేశారా? డాక్టర్ను కాల్చింది తాను కాదని చెప్పినప్పుడు ఎందుకు చనిపోయాడు? పెరిగిన ఒత్తిడి కారణంగా అతను చనిపోయాడా?
ఆసుపత్రులలో పెట్టుబడి రూ.2 కోట్లు పెట్టానని శశికుమార్ చెప్పగా, పార్ట్నర్స్ మాత్రం రూ.75 లక్షలు చెబుతున్నారు. ఇందులో ఏది నిజం? సూసైడ్ నోట్లో ఉన్నది అసలు ఆయన చేతిరాతేనా?.. ఇలా శశికుమార్ ఆత్మహత్యలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, కాల్పులు జరిగిన రోజు శశికుమార్ను ఆయన స్నేహితురాలు చంద్రకళ తన ఫాంహౌస్కు తీసుకు వెళ్లి విడిచి పెట్టారు. ఆమె శశి స్నేహితురాలు అని చెబుతున్నారు. అయితే, ఆమె ఎవరో తనకు తెలియదని శశికుమార్ భార్య చెబుతుండటం గమనార్హం.