తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 7న పోలింగ్, 11న కౌంటింగ్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదలైంది. డిసెంబర్ 7న పోలింగ్కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనట్లే. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే, టిక్కెట్ల కోసం రచ్చరచ్చ
నామినేషన్లు ఈ నెల 19వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. ఈ నెల 20వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్. డిసెంబర్ 11న కౌంటింగ్.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొత్తగూడెం, చెన్నూరు, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, ములుగు, సిర్పూర్, భూపలపల్లిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది.
ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణపైనా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సరిహద్దు జిల్లాలు, నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఛత్తీస్గఢ్లో జరుగుతోన్న ఘటనల దృష్ట్యా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు శాసనసభ నియోజకవర్గాలకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల సంఘం తరఫున అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన వ్యయ పరిశీలకులు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తారు.