పోతిరెడ్డిపాడు నుంచి చుక్కనీరు తరలించలేరు, విపక్షాలపై మండలి చైర్మన్ గుత్తా ఫైర్..
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుక్కనీరు తరలించలేదు అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం భావించడం అత్యాశే అవుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉండగా.. నీటి బొట్టును కూడా తరలించలేరని అభిప్రాయపడ్డారు. పులిచింతల ప్రాజెక్టుతోపాటు పోతిరెడ్డిపాటు విషయంలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎంపీలు, అప్పటి ఎమ్మెల్యేలు మద్దతిచ్చారని గుర్తుచేశారు.
పోతిరెడ్డిపాడు విషయంపై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా తెలంగాణ సమాజం ఏకం కావాలని సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రోజుల తరబడి దీక్ష చేసి.. 60 ఏళ్ల కలను సాకారం చేసుకున్నామని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు రెండు గంటల దీక్ష చేసి.. ఉద్యమ దీక్షలను తక్కువ చేస్తున్నాయని చెప్పారు.
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ విధానం మరచిపోయాయని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన లాగానే ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు అని.. తెలంగాణకు ద్రోహం చేయాలని అనుకోవడం సరికాదన్నారు. రైతుల సమస్యలను రాజకీయ చేయడంలో ఆ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు మాత్రం ఇవ్వబోరు అని మండిపడ్డారు.