'డాక్టర్ కేసీఆర్', ఉస్మానియా నుంచి తెలంగాణ సీఎంకు డాక్టరేట్
హైదరాబాద్ : 14 ఏళ్ల అవిశ్రాంత ఉద్యమ యోధుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక డాక్టర్ చంద్రశేఖరరావుగా మారనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కేసీఆర్ చేసిన అలుపెరుగని శాంతియుత పోరాటానికి గాను ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేయనుంది. కాగా, 15ఏళ్లుగా ఉస్మానియా నుంచి ఎవరికీ డాక్టరేట్ దక్కపోగా.. ఇప్పుడా గౌరవం కేసీఆర్ కు దక్కనుండడం విశేషం.
వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ.. ఇప్పటిదాకా కేవలం 20మందికి డాక్టరేట్లను ప్రధానం చేసింది. అందులో భారతరత్న అంబేడ్కర్ లాంటి మహామహులతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇకపోతే వచ్చే ఏడాదితో ఉస్మానియా వందేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా.. సీఎం కేసీఆర్ కు ఈ డాక్టరేట్ ప్రధానం చేయనుంది వర్సిటీ.
వర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ లో కేసీఆర్ కు డాక్టరేట్ ప్రధానం చేసేందుకు గాను పాలక వర్గం ఇప్పటికే తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే 1970లలో ఎంఏ లిటరేచర్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.