అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట్.. పరకాల పాలిటిక్స్ పీక్!
ఇటీవల తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఓరుగల్లు రాజకీయాలు హీటెక్కాయి. మళ్లీ పరకాల నియోజకవర్గం నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో మొదలైన రాజకీయ దుమారం ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.
అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట్
కొండా సుస్మిత తన ఇన్స్టాగ్రామ్లో "అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే" అని పోస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకపక్క సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించినా, అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే అని కొండా సుస్మిత తనను తానూ ప్రకటన చేసుకోవటంతో వచ్చే ఎన్నికల్లో కొండా సుస్మిత పోటీ చేయటం పక్కా అన్న సంకేతాన్ని ఇస్తుంది.

సుస్మిత పోస్ట్ పై స్పందించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
ఇక దీనిపై వరంగల్లో జరిగిన ఒక సమావేశంలో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన ఇటీవలి సోషల్ మీడియా వ్యాఖ్యలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం పూర్తిగా పార్టీ అధిష్ఠానం పరిధిలోకి వస్తుందని, అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, పార్టీ తీసుకునే నిర్ణయమే అందరికీ ఆమోదయోగ్యమని వెల్లడించారు.
ముఖ్యమంత్రి పరకాల సభలో తన పేరును ప్రకటించటంపై ఎమ్మెల్యే రేవూరి
పరకాల నియోజకవర్గంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజలకు సరైన సమాచారం అందించాలని భావించి కొన్ని వివరణలు ఇచ్చామని చెప్పారు. అనేక సర్వేల ఫలితాల ఆధారంగానే ముఖ్యమంత్రి పరకాల సభలో తన పేరును ప్రకటించారని రేవూరి వివరించారు. ఆ ప్రకటన తనపై మరింత బాధ్యతను పెంచిందని, నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకునేలా మరింత చురుకుగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
పచ్చ కాంగ్రెస్, తెల్ల కాంగ్రెస్ అనే వర్గాలు లేవన్న రేవూరి ప్రకాష్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో 'పచ్చ కాంగ్రెస్', 'తెల్ల కాంగ్రెస్' అనే వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాను కానీ, మంత్రులు కానీ అందరూ పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పరకాల సీటు కోసం సీఎం రేవంత్ ప్రకటన ఇప్పటి నుండే సిగపట్లకు కారణం
పరకాలలో జరిగిన సభకు మంత్రి కొండా సురేఖను తానే ఆహ్వానించానని, కానీ ఆమె ఎందుకు హాజరు కాలేదో తనకు తెలియదని చెప్పారు. మొత్తంగా పరకాల సీటుకోసం సీఎం రేవంత్ ప్రకటన ఇప్పటి నుండే సిగపట్లకు కారణం అయ్యింది.














Click it and Unblock the Notifications