రోహిత్ సూసైడ్పై రాజకీయంవద్దు, చంద్రబాబుని ఆదుకునేందుకు రాను: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమన్నారు. మన విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందనేది నిజమన్నారు. అయితే దానిని రాజకీయం చేయడం సరికాదన్నారు.
ఏపీలో జరిగిన కాపు గర్జన నేపథ్యంలో తునిలో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పైన మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఇదే సమయంలో విలేకరులు వేముల రోహిత్ ఆత్మహత్య పైన ప్రశ్నించారు.
దానికి పవన్ పైవిధంగా స్పందించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖ గురించి ఓ విలేకరి అడగగా... రాసిన వారిలో ఆయనే మొదటి వ్యక్తి కాదని చెప్పారు. ఓ విద్యార్థి నిరాశ, నిస్పృహలతో చనిపోవడం బాధాకరమన్నారు. ఇది వర్సిటీకి సంబంధించిన అంశమని చెప్పారు. రాజకీయం చేయవద్దన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల కోడ్ ఉన్నందున దాని గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
చంద్రబాబుకు ఆపద్భాందవుడిని కాదు
తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదుకునేందుకు వస్తాననే వాదనలో నిజం లేదని, దానిని తాను ఒప్పుకోనని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు చెప్పారు.
కాపు గర్జన నేపథ్యంలో తుని ఘటన పైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఓ ప్రశ్నపై మాట్లాడుతూ.. తాను ప్రభుత్వాన్ని నడపడం లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తాను మాట్లాడుతానని చెప్పారు. ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోనన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చిరంజీవి లేఖ రాశారని ఓ విలేకరి చెప్పగా.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఇస్తాం.. లేదంటే లేదని చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. తాను అధికార పార్టీకి తోకలా అయ్యారనే వాదనలో పస లేదన్నారు.
తాను మొదటనే చెప్పానని తుని ఘటనలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, తీసుకుంటే ఇలా జరగకపోయేదని చెప్పానని గుర్తు చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి పైగా రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. రిజర్వేషన్లకు తమిళనాడు, కర్నాటకలు మనకు ఉదాహరణగా ఉన్నాయన్నారు.