పెద్దపల్లిలో వివాహితపై గ్యాంగ్ రేప్.. ఇటుకబట్టీలో దారుణం... యజమానులే కీచకులు...?
పెద్దపల్లిలో ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇటుకబట్టీలో పనిచేసే వివాహితపై యజమానులే గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారని ఇటీవల మానవ హక్కుల కమిషన్కు అందిన లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘటన తర్వాత భర్త,పిల్లలతో కలిసి ఆ వివాహిత తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇటుకబట్టీ యజమానులు వారిని నిర్బంధించి చితకబాదినట్లు లేఖలో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రాసిన ఆ లేఖతో రంగంలోకి దిగిన హెచ్ఆర్సీ వెంటనే దీనిపై విచారణకు ఆదేశించింది.

ఒడిశా నుంచి బతుకుదెరువు కోసం...
హెచ్ఆర్సీకి అందిన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన వివాహిత(22) తన కుటుంబంతో కలిసి బతుకు దెరువు నిమిత్తం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చింది. వారితో పాటు ఒడిశా నుంచి మరికొన్ని కుటుంబాలు కూడా ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్లారు. స్థానిక గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ ఇటుకబట్టీలో కొన్నాళ్లుగా వీరంతా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో బట్టీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన 22 ఏళ్ల వివాహితపై యజమానుల కన్ను పడింది.

వివాహితపై గ్యాంగ్ రేప్...
బట్టీ యజమానులైన ఐదుగురు వ్యక్తులు ఇటీవల ఆ వివాహితపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఎదురు తిరిగినందుకు ఆమెతో పాటు ఆమె భర్తపై దాడి చేశారు. దీంతో అక్కడినుంచి తప్పించుకునేందుకు యజమానుల కంట పడకుండా రామగుండం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి యజమానులు అక్కడికి వెళ్లి.. తిరిగి వాళ్లను బట్టీకి తీసుకొచ్చారు. వారితో పాటు అక్కడే పనిచేస్తున్న మరో 14 మంది ఒడిశాకు చెందిన కూలీలను నిర్బంధించి దాడి చేశారు.

రంగంలోకి హెచ్ఆర్సీ...
ఇటుకబట్టీ యజమానుల ఆగడాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతుండగా.. కొంతమంది స్థానికుల దృష్టికి ఈ విషయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ రేప్ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు హెచ్ఆర్సీకి లేఖ రాసినట్లు సమాచారం. వెంటనే స్పందించిన హెచ్ఆర్సీ జిల్లా అధికార యంత్రాంగానికి దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇటుకబట్టీ వద్దకు చేరుకుని కూలీలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో బాధిత మహిళ,ఆమె భర్త కనిపించలేదని సమాచారం. యజమానులే వారిని నిర్బంధించి ఉంటారని అనుమానిస్తున్నారు.

కొనసాగుతోన్న విచారణ...
అక్కడ పనిచేస్తున్న కూలీలను ప్రభుత్వ ఆధీనంలోని షెల్టర్ హోమ్కు తరలించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్, కూలీల నిర్బంధంపై విచారణ కొనసాగుతోందని... త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు. గతంలోనూ ఇదే ఇటుకబట్టీలో ఓ కూలీ మృతి చెందగా... యజమానులు దాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టారన్న ఆరోపణలున్నాయి. వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటన జిల్లా కేంద్రంలో ఇప్పుడు కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications