దేశ ప్రధాని అధాని.!నరేంద్ర మోదీ కాదు.!వరంగల్ సభలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.!
వరంగల్/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ పై ధ్వజమెత్తారు. మోదీ మిత్రుడు కాబట్టి ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానికి ఏడు ఎయిర్ పోర్టులు అమ్మారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేసి, ఉద్యోగులను బీజేపీ ప్రభుత్వం ఆగమాగం చేస్తుందని ఘాటు ఆరోపణలు చేసారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలను అమ్మడం, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల హక్కులను హరించే విధంగా చట్టాలు చేస్తోందని కవిత విమర్శించారు.

ఎన్నికలప్పుడు ఎలక్షన్ మోడ్,తర్వాత ఫ్లైట్ మోడ్. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత
బీజేపీ నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టిందని, రైతుల పోరాటానికి దిగివచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు కవిత. రైతుల స్పూర్తిని కార్మికులు అందిపుచ్చుకోవాలని, ఆ స్పూర్తితో ఉద్యమాలు చేసి, కార్మకుల వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, లక్షల కోట్ల విలువైన ఎయిర్ ఇండియాను కేంద్రం వేల కోట్లకే అమ్మిందని, బొగ్గు గనులు, కరెంటు కంపెనీలు, యావత్ దేశంలో ఉన్న అన్ని సంస్థలను అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు కవిత.

దేశ ప్రధాని ఎవరు..? సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..
మొన్న ఇతర దేశ ప్రధాని లండన్ నుండి వచ్చి, ప్రధాని మోదీని కాకుండా నేరుగా అదానిని కలిసాడని, దేశ ప్రధాని మోదీ కాదని, అదానీ నిజమైన ప్రధాని అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని సంచలన ఆరోపణలు చేసారు కవిత. బీజేపీది ఎన్నికలకు ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత మరోమాట అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇంటింటికీ ఉచితంగా రేషన్ ఇస్తామన్నారు. ఎన్నికలు ముగిసాక అనేక నిబంధనలు పెట్టి, రేషన్ కట్ చేసారు. ప్రధాని మోదీ ఎన్నికలప్పుడు ఎలక్షన్ మోడ్, లేకపోతే ఎరోప్లేన్ మోడ్ లో ఉంటారన్నారు కవిత.

రాష్ట్రాన్ని కన్న తండ్రిలా కాపాడుతున్న కేసీఆర్..దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నామన్న కవిత
దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం లాగే, పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ పథకం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కవిత. ప్రభుత్వం కన్నతండ్రి లాగ ప్రజలను కళ్లలో పెట్టుకుని చూసుకోవాలని, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా, వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఆర్టీసీని సీఎం చంద్రశేఖర్ రావు కాపాడుతున్నారన్నారు కవిత. ఆటో రిక్షాలకు పన్నులు రద్దు చేచడంతో పాటు, 25 వేల విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని కవిత గుర్తు చేసారు.

ఇళ్లు లేని పేదలు ఉండకూడదు.. అదే కేసీఆర్ లక్ష్యమన్న కవిత
టీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన నిలబడే పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ యువకులు, మహిళల పక్షాన నిలబడే పార్టీ అన్నారు కవిత. ఉద్యోగావకాశాలు కల్పించకుండా యువతను వేధిస్తున్న పార్టీ బీజేపీ అని, ఉద్యోగాలు ఇచ్చి యువతకు అండగా నిలుస్తున్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు కవిత. వరంగల్ లాంటి పట్టణంలో, పేద ప్రజలకు స్థలం ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయించారన్నారు. తెలంగాణలో ఇళ్లు లేని వారు ఉండకూడదనేది సీఎం కల అని వరంగల్ ప్రజలనుద్దేశించి కవిత ప్రసంగించారు.












Click it and Unblock the Notifications