ప్రచారం మీద ఉన్న శ్రద్ధ దేశ ప్రజల ఆరోగ్యం మీద లేదు.!ప్రధాని మోదీపై పొన్నం ప్రభాకర్ ఫైర్.!
హైదరాబాద్ : యాభై ఆరు ఇంచుల చాతి ఉందని చెప్పిన ప్రధానమంత్రి దేశంలో అనేక మార్పులు, చేర్పులు చేస్తారని ఆశించిన ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఒక కరోనా మహమ్మారి వస్తే దాన్ని నివారించే ప్రయత్నం చేయకపోగా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేక పోయారని మండిపడక్డారు. దేశంలో ఆక్సిజన్ లేక, రెమిడిసివర్ ఇంజెక్షన్లు లేక, వ్యాక్సిన్లు లేక ప్రజలు అల్లాడుతున్నా ప్రధాన మంత్రి కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి వందల వేల శవాల కుప్పలుగా పడిపోతుంటే, కవులు కవితలుగా ప్రభుత్వ వైఫల్యాలను వర్ణిస్తుంటే వారి పైన చర్యలు తీసుకునే సమయం ఉంది కానీ, కరోనావైరస్ ను నియంత్రించేందుకు మాత్రం సమయం ఉండదా అని పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.1250 రూపాయలు లేదా 1500 వందల రూపాయలలో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలు వ్యాక్సిన్లు వేయించుకుంటే దానికి ప్రధాని మోదీ ఫోటోతో ఎందుకు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నారని పొన్నం ప్రశ్నించారు.
భారత దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని పొన్నం ప్రభాకర్ నిలదీసారు. వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ పోలియో కేంద్రాల్లో ఉంచి, పోలియో చుక్కలు ఏ మాదిగానైతే వేసారో, అదే మాదిరి వ్యాక్సీన్ ను కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని పొన్నం సూటిగా ప్రశ్నించారు. శ్రమ లేకుండా బీజేపి ఫోటోతో సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు ఆ సర్టిఫికెట్ దగ్గరుంచుకోవాలన్నా కూడా అవమానంగా అనిపిస్తుందని పొన్నం ఆవేదన వ్యక్తం చేసారు. నేడు భారతదేశంలో కరోనా బాదితులకు ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో లేక ఎంత ఇబ్బంది అయ్యిందో భారత ప్రధానిగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసువాలని విజ్ఞప్తి చేసారు. దేశ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితుల పట్ల ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయో కూడా ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రధాని మోదీకి సూచించారు.