భవిష్యత్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా ఉండబోతోంది..!!
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- హైదరాబాద్కు రానున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. తన పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ ఇది. జనవరిలోనే మోదీ హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ- అప్పట్లో వాయిదా పడింది.
తెలంగాణ- ఏపీ మధ్య పట్టాలెక్కనున్న రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్కు నంబర్లను కూడా రైల్వే మంత్రిత్వ శాఖ కేటాయించింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్లే సర్వీస్ కు 20701, తిరుపతి నుంచి సికింద్రాబాద్ తిరుగుముఖం పట్టే సర్వీస్కు 20702 నంబర్లను ఖరారు చేసింది. ప్రారంభోత్సవం రోజున ఉదయం 11:30 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

మిగిలిన రోజుల్లో తెల్లవారు జామున 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. నల్గొండ-7:19, గుంటూరు-9:45, ఒంగోలు- 11:09, నెల్లూరు-12:29, తిరుపతికి మధ్యాహ్నం 2:30 నిమిషాలకు చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో 3:15 నిమిషాలకు బయలుదేరుతుంది. నెల్లూరు- 5:20, ఒంగోలు- 6: 30, గుంటూరు- 7:45, నల్గొండ- 10:10, సికింద్రాబాద్ కు రాత్రి 11.45 నిమిషాలకు చేరుకుంటుంది. తొలి రోజున మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

కాగా- అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీని విలువ 719 కోట్ల రూపాయలు. విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇది రూపుదిద్దుకోనుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్గా దీన్ని అభివృద్ధి చేస్తామంటూ కేంద్ర పర్యటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డి ఇదివరకే చెప్పారు.

దీనికి అనుగుణంగా ఈ స్టేషన్ ఇక రూపాంతరం చెందబోతోంది. విమానాశ్రయాల్లో ఉన్నటువంటి సౌకర్యాలను ఈ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి తీసుకుని వస్తామని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందనే విషయం మీద రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కొన్ని మోడల్ ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.












Click it and Unblock the Notifications