దుబ్బాక గెలుపు చారిత్రాత్మకం... ఇదీ ప్రధాని మోదీ రియాక్షన్...
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దుబ్బాకలో బీజేపీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ శ్రేణులు మరింత శక్తితో రాష్ట్రానికి సేవ చేసే బలాన్ని ఈ విజయం ఇచ్చిందన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలన అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ట్విట్టర్లో స్పందించారు.
దుబ్బాక గెలుపు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. గతేడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన నాలుగు స్థానాలు గాలివాటం కాదని... జనంలో తమకు ఆదరణ ఉందని ఈ ఉపఎన్నికతో నిరూపించుకుంది. దుబ్బాక గెలుపుతో భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తరించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. తాజా ఎన్నికతో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు పంపించిన బీజేపీ... 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతోంది.

మంగళవారం(నవంబర్ 10) వెలువడిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రఘునందన్ రావుకు మొత్తం 63,352 ఓట్లు పోలవగా... టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సూజాతకు 62,273 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లలో బండారు నాగరాజు(3,570 ఓట్లు) తప్ప మిగతా 20 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ 2వేల పైచిలుకు ఓట్లను సాధించలేకపోయారు. ఇక నోటాకు 554 ఓట్లు పడ్డాయి.
దుబ్బాకలో గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు... ఎట్టకేలకు అక్కడ విజయం సాధించారు. ఈ గెలుపును దుబ్బాక ప్రజలకే అంకితం చేస్తున్నానని చెప్పారు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజల కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు.
దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం. @BJP4Telangana కు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మాకు రాష్ట్ర అభివృద్ధికై సేవ చేసేందుకు మరింత శక్తిని ఇస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేసారు.
— Narendra Modi (@narendramodi) November 10, 2020












Click it and Unblock the Notifications