మావోలతో లింక్: కెసిఆర్ సభలో నిరసన తెలిపిన విజయ్ అరెస్ట్, విడుదల
ఖమ్మం/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభలో... సీఎంను నిలదీసిన విజయ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి మావోయిస్టులతో లింకులు ఉన్నాయని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ రెండు రోజుల క్రితం హన్మకొండ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రి సభ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పలు అంశాల పైన ముఖ్యమంత్రిని నిలదీసే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, కెసిఆర్ను నిలదీసిన వారిలో విజయ్ అనే యువకుడు ఉన్నాడు. అతనిని ఖమ్మం జిల్లా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
విజయ్ని కోర్టులో హాజరుపరచాలి: వరవర రావు
వరంగల్ కెసిఆర్ సభలో నిరసన తెలిపిన ఓయు విద్యార్థి విజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. విజయ్ తల్లిదండ్రులు కూడా పోలీసులు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. విజయ్, అతని తల్లిదండ్రులను కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కెసిఆర్ సభలో నిరసన తెలిపినందుకే విజయ్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. విజయ్ని వెంటనే కోర్టు ఎదుట హాజరుపర్చాలని విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు డిమాండ్ చేశారు.
ఎవరీ విజయ్?
కెసిఆర్ సభలో నిరసన తెలిపిన విజయ్ పూర్తి పేరు.. మనువాడ విజయ్. అతను ఉస్మానియాలో ఎంటెక్ విద్యార్థి. విజయ్ స్వస్థలం కరీనంగర్ జిల్లా వేములవాడ. ఇదిలా ఉండగా, గతంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని నిలదీసిన కొమురయ్య అనే రైతును కూడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతను విడుదలయ్యారు.
విజయ్ని వదిలేసిన పోలీసులు
ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి విజయ్ని పోలీసులు విడుదల చేశారు. ఖమమం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని గురువారం పోలీసులు విడిచి పెట్టారు. విజయ్ వద్ద హామీ పత్రం తీసుకున్నారని తెలుస్తోంది.