చదువుల్లో లాగే రాజకీయాలకు కూడా మెరిట్ అవసరం.!కాంగ్రెస్ కు నాయకత్వం లేదన్న ఈటల.!
కరీంనగర్/హైదరాబాద్: ఎప్పుడూ సౌమ్యంగా, మితంగా, మృధువుగా మాట్లాడే హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎందుకో కాస్త కఠినంగా మాట్లడారు. అదికూడా సొంత పార్టీ గురించి కాకుండా పక్క పార్టీ అంతర్గత వ్యవహారం గురించి రాజకీయ ఆరోపణలు గుప్పించారు. కరీంనగర్ జిల్లా బీజేపీ శిక్షణా తరగతులకు హాజరైన ఈటల రాజేందర్ మగ్డంపూర్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పైన ఘాటు విమర్శలు చేసారు. కాంగ్రెస్ కి బలమైన నాయకత్వం లేదని, థర్డ్ ఫ్రంట్ విఫల ప్రయత్నం మాత్రమేనని, చేత కాని వారి చేతిలో దేశాన్ని పెట్టవద్దని, మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లోనే అధికారం పెట్టాలని దేశ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేసారు. రాబోయే రోజుల్లో దేశంలో వచ్చేది కూడా బీజేపి ప్రభుత్వమేనని, 2014 ఎన్నికల ముందే నరేంద్ర మోడీ ని ప్రధానిగా ప్రకటించుకొని ఎన్నికలకు వెళితే ప్రజలు గొప్పగా ఆశీర్వదించారన్నారు ఈటల రాజేందర్.
ఐదేళ్ల పాలన తరువాత మోదీ నాయకత్వంలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావించి రెండో సారి 303 సీట్లు ఇచ్చారన్నారు ఈటల. ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన పార్టీగా, శక్తి వంతమైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ అవతరించారని, చట్టాలు ప్రజలకోసం చేస్తారు తప్ప పార్టీలకోసం కాదని, ప్రజల సంక్షేమం కోసం చేస్తామని, రైతు చట్టాలు రైతుల కోసం తీసుకువచ్చారు కానీ, వాటిని దేశ రైతాంగం అంగీకరించకపోతే విజ్ఞత గల ప్రధానిగా వాటిని వెనక్కు తీసుకున్నారని గుర్తు చేసారు. ఒక చట్టాన్ని వాపస్ తీసుకొని పార్లమెంట్ లో ఆమోదింపచేసిన మొదటి ప్రధాని మోదీ అని అన్నారు. సమాజంలో ఉద్యోగానికి, చదువుకోవడానికి మెరిట్ ఎలాగ అవసరమో రాజకీయాలకు కూడా అలాంటి మెరిట్ కావాలని, ఈశిక్షణా తరగతులు మానసికంగా ఎదగడానికి, ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపి శ్రేణుల కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలని, సమాజాన్ని ముందుకు నడిపించేది రాజకీయ వ్యవస్థలే నని ఈటల రజేందర్ ఉద్బోదించారు.