అమిత్ షా తో పొంగులేటి భేటీ - కేసీఆర్ ఫిక్స్ చేసిన ముహుర్తానికే..!!
ఊహించిందే జరుగుతోంది. బీఆర్ఎస్ నేత పొంగులేటి బీజేపీలోకి ఎంట్రీ దాదాపు ఖరారైంది. ఇప్పటికే తన అననుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన పొంగులేటి పరోక్షంగా పార్టీ మార్పు పైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నేతలు పొంగులేటి రాకను ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. జాతీయ నేతలను ఆహ్వానించారు. ఆ సమయంలో పొంగులేటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఆ చర్చల ద్వారా అఫీషియల్ లో కాషాయం కండువా కప్పుకోనున్నారు.
18న అమిత్ షాతో పొంగులేటి భేటీ
మాజీ ఎంపీ పొంగులేటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ నెల 18న ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి పార్టీ మార్పు వ్యవహరం పై కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. 2014లో ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా తన ఆత్మీయులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ లో నాలుగేళ్లుగా దక్కిన గౌరవం ఏంటో చూస్తున్నామంటూ తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఆయన కు తెలంగాణ ప్రభుత్వం తాజాగా సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, బీఆర్ఎస్ పొంగులేటి తమతో ఉండడనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో పొంగులేటి ఇక నేరుగా పార్టీ మార్పు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
18న ఖమ్మం వేదికగా కేసీఆర్ సభ
ఈ నెల 18న ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు నిర్వహించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత డిసెంబర్ లో ఢిల్లీ వేదికగా సభకు నిర్ణయించారు. కానీ, తెలంగాణలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఖమ్మం వేదికగా బీజేపీ బీఆర్ఎస్ ను బలహీనపర్చే చర్యలను వేగవంతం చేసింది. సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. ఈ సమయంలో ఖమ్మం వేదికగానే అన్ని పరిణామాలకు సమాధానం చెప్పాలని సీఎం నిర్ణయించారు. పార్టీ నేతలకు ఖమ్మంలో సభ గురించి దిశా నిర్దేశం చేసారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంతో పాటుగా అఖిలేష్ యాదవ్, కుమార స్వామి ని సభకు ఆహ్వానించారు. ఖమ్మంలో కమ్యూిస్టుల ప్రభావం ఎక్కువ కావటంతో అక్కడ సభ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
అటు బీజేపీ..ఇటు బీఆర్ఎస్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నేతలను బీజేపీలోకి చేర్చుకొనేందకు కమలం పార్టీ నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బీజేపీ నుంచి వలసలు ప్రోత్సహించేలా గులాబీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. ఇక..ఇప్పుడు అమిత్ షా తో పొంగులేటి భేటీ సమయంలో పార్టీలో దక్కే ప్రాధాన్యత..తెలంగాణలో పార్టీ బలోపేతం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి సూచించిన వారికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని సమాచారం. ఈ భేటీ తరువాత బీజేపీలో తన అధికారిక చేరిక గురించి పొంగులేటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
Comments
English summary
Ponguleti Srinivasa Reddy to meet union home minister Amit Shah on 18th januray at Dehli,KCT publice meeting at Khammam on same day.
Story first published: Monday, January 9, 2023, 12:57 [IST]