ఓట్లు చీల్చడానికే వైసిపి పోటీ: పొన్నం, యాగాలు చేస్తే ఓటేయరని విహెచ్
వరంగల్: వరంగల్ లోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పోటీకి దింపిందని కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా మాట్లాడారు.
ఉద్యోగుల విభజన అని మభ్యపెట్టిన కేసిఆర్ 18 నెలలుగా మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో సకలజనుల సమ్మె వేతనం ఇస్తామని హామీ ఇచ్చి జీవో పాస్ చేయలేదని పొన్నం మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. వరంగల్లో టీఆర్ఎస్ ఓడిపోతే ఆ పార్టీలో సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. యజ్ఞాలు చేస్తే ప్రజలు ఓట్లేయరని హీహెచ్ విమర్శించారు.
నిన్నటి వరకు కేసీఆర్కు ప్రజల కష్టాలు కనిపించలేదని, హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టమనే కేసీఆర్, ప్రశ్నించిన పాపానికి జైల్లో పెడుతున్నాడని ఆయన బుధవారం హైదరాబాదులో ఆరోపించారు. ఏం తప్పు చేశాడని రైతు కొమరయ్యను జైల్లో పెట్టారని ఆయన ప్రశ్నించారు. రైతు కొమరయ్యను తాము విడుదల చేయిస్తే బీజేపీ నేతలు దాన్ని హైజాక్ చేశారని వీహెచ్ ఆరోపించారు.