Power Crisis in Telangana: కరెంటు కోతలు ఉండబోవంటూ మంత్రి జగదీష్ రెడ్డి హామీ
హైదరాబాద్: బొగ్గు సంక్షోభం ప్రస్తుతం దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోంది. ఇదివరకెప్పుడూ లేనంతంగా బొగ్గు కొరత ఏర్పడటం వల్ల థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మందగించింది. భారీ వర్షాల వల్ల బొగ్గు వెలికితీత ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. చాలా చోట్ల బొగ్గు గనుల్లో వరదనీరు చేరుకుంది. విజయవాడలోని డాక్టర్ నార్ల తాతారావు, కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నామమాత్రంగా సాగుతోంది. కర్ణాటకలోని రాయచూర్ థర్మల్ కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం నెలకొంది.
షహిద్ కిసాన్ దివస్గా అక్టోబర్ 12: లఖింపూర్ ఖేరికి ప్రియాంక గాంధీ..రైతు నేతలు
అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం..
దీని ప్రభావంతో చాలా రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్తోన్నాయి. కరెంటు కోతలను తప్పనిసరిగా విధించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోన్నాయి. బెంగళూరులో ఇవ్వాళ్టి నుంచి విద్యుత్ కోతలు మొదలవుతాయని బెంగళూరు ఎలక్ట్రిసిటీ సరఫరా కంపెనీ స్పష్టం చేసింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో కరెంటును సరఫరాను నిలిపివేయాల్సి వస్తోందని స్పష్టం చేసింది. ఏపీలోనూ కరెంటు కోతలు ఆరంభం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ను ప్రకటించారు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు.
నో పవర్ కట్స్..
తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు ఉండబోవని హామీ ఇస్తోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలినంతగా ఉన్నాయని చెబుతోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పాదనను మరింత ముమ్మరం చేశామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు అవకాశమే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ఒక్క నిమిషం కూడా కోతలు ఉండబోవని అన్నారు.
200 సంవత్సరాలకు సరిపడేలా
రాష్ట్రంలో 200 సంవత్సరాలకు సరిపడేలా బొగ్గు నిల్వలు ఉన్నాయని, కరెంటు కోతలు ఉండొచ్చని ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు వెలికితీత ప్రక్రియ ధ్వంసం కావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బొగ్గు వెలికితీతను దెబ్బతీశాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తతో వ్యవహరించట్లేదని అన్నారు. బొగ్గు సంక్షోభానికి భారతీయ జనతా పార్టీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు.
వందశాతం సరఫరా..
శ్రీశైలం, నాగార్జున సాగర్లోని హైడల్ పవర్ ప్రాజెక్టులు, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరుల్లోని థర్మల్ కేంద్రాల్లో చాలినంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందని జగదీష్ రెడ్డి అన్నారు. గత ఏడాదిలో రాష్ట్రానికి 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం కాగా.. ఒక్క మెగావాట్ కూడా తగ్గనివ్వలేదని, 100 శాతం సరఫరా చేశామని చెప్పారు. మిగులు విద్యుత్ను సాధించేలా ఉన్న తెలంగాణలో కరెంటు కోతలను విధించే ప్రమాదం వస్తే.. దానికి దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
కోతలు విధించాల్సి వస్తే.. కేంద్రానిదే బాధ్యత..
కేంద్రప్రభుత్వం ఇష్టారీతిన తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పబోవని జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ను సాధించిన తెలంగాణలోనూ కరెంటు కోతలను విధించే పరిస్థితి తలెత్త వచ్చిన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ కోతలు వస్తాయే తప్ప, ఇప్పటికిప్పుడు ఆ ప్రమాదం లేదని జగదీష్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోన్నారని, సకాలంలో నిర్ణయాలను తీసుకుంటున్నారని అన్నారు. ఫలితంగా- ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో కోతలను విధించాల్సిన పరిస్థితి రాలేదని జగదీష్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రాల హక్కులను కాలరాసేలా..
రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని, బొగ్గు గనుల కేటాయింపుల్లో పక్షపాత వైఖరిని అనుసరిస్తోందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే ఇవాళ దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరచుకోవాలని రాష్ట్రాల హక్కులను కాల రాయకూడదని చెప్పారు. ఈ తప్పుడు విధానాలతో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని జగదీష్ రెడ్డి అన్నారు.