భద్రాద్రి రాముడి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము; ప్రసాద్ ప్రాజెక్ట్ ప్రారంభం, తెలుగులో అభివాదం!!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఆలయ అధికారులు ప్రత్యేక గౌరవ లాంఛనాలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు.

భద్రాచలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మొదట ఐటిసి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్రపతికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో గిరిజనసంప్రదాయ నృత్యాలు కొమ్ము, రేలా నృత్యాలతో భద్రాచలంలో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఆమె వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి రాముడ్ని దర్శించుకుని ప్రసాద్ ప్రాజెక్ట్ ప్రారంభం
శ్రీ సీతా రామ చంద్ర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 41.38 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రసాద్ (తీర్ధయాత్రల పునర్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి)ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భవిష్యత్తులో భద్రాచల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత ప్రాచుర్యం పొందనుందన్నారు. ప్రసాద్ నిధులతో భద్రాచల దేవస్థానానికి సంబంధించిన కొన్ని మౌలిక వసతులతో పాటు భక్తులకు వసతి సౌకర్యాలు, ఆలయానికి విస్తృత ప్రచారం వంటి కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు.

ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను వర్చ్యువల్ గా ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అంతేకాదు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలలో ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను వర్చ్యువల్ గా ప్రారంభించారు. భద్రాచలంలో సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనాన్ని ప్రారంభించిన అనంతరం, గిరిజన ప్రాంతాలలో విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, తెలుగులో అభివాదం చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

నా తెలంగాణా కోటి రతనాల వీణ .. తెలుగులో అభివాదం చేసిన రాష్ట్రపతి
ప్రముఖ కవి దాశరధి కవితా పంక్తులు గుర్తు చేసిన రాష్ట్రపతి నా తెలంగాణా కోటి రతనాల వీణ అని ప్రస్తావించారు. తెలంగాణాలో మొదటి పర్యటనలో దేశ ప్రజలకోసం తెలంగాణ ఆలయాల్లో ప్రార్ధించే అవకాశం లభించిందనీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు గిరిజన, మారుమూల ప్రాంతాల పిలల్ల విద్యా అవసరాలను తీరుస్తున్నాయన్నారు. ఇతర ప్రాంతాల గిరిజన బాలలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయటం పట్ల రాష్ట్ర పతి సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణా ఆలయాల్లో దేశ ప్రజల కోసం ప్రార్ధించే అవకాశం వచ్చిందన్న ద్రౌపది ముర్ము
పర్యాటక రంగ అబివృద్ధి ద్వారా స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తెలంగాణా లో మొదటిసారి చేస్తున్న పర్యటనలో ఆలయాల్లో దేశ ప్రజలకోసం ప్రార్ధించే అవకాశం లభించిందనీ అన్నారు.
తెలంగాణా వనవాసీ పరిషత్ ద్వారా గిరిజన సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న కృషిని ఆమె ప్రస్తావించారు. సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు సామాజిక మూల విలువలను పటిష్టం చేస్తాయని రాష్ట్రపతి అభిప్రాయ పడ్డారు. అన్ని ప్రగతి రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని చెబుతూ, గిరిజన మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications