కరీంనగర్లో వ్యభిచార దందా బట్టబయలు-భార్యాభర్తలే నిర్వాహకులు-ముగ్గురి అరెస్ట్
కరీంనగర్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో వ్యభిచార స్థావరంపై దాడులు చేసి విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మరవేని సాయికుమార్,అతని భార్య కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. విలాస జీవితం గడిపేందుకు వీరు అడ్డదారులు తొక్కారు. కొన్నాళ్లుగా వ్యభిచార దందా నిర్వహిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
వీరు వాట్సాప్ ద్వారా విటులకు యువతుల ఫోటోలను పంపిస్తారు. గంటకో రేటు చొప్పున వారితో డీల్ మాట్లాడుకుంటారు. ఆపై మంకమ్మతోటలోని తమ ఇంట్లో లేదా నగర శివారులోని కాలనీల్లో ఉన్న అపార్ట్మెంట్లు,ఇండిపెంట్ హౌస్లలో విటులకు ఏర్పాట్లు చేస్తారు. ఇటీవల ఈ వ్యభిచార దందాపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. మంకమ్మతోటలోని ఆ దంపతుల ఇంటిపై దాడి చేశారు.
దాడుల్లో హుస్నాబాద్కి చెందిన రామడుగు అశోక్,చందు,పొన్నం శంకర్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు.వీరి నుంచి రూ.37,380 నగదు,5 సెల్ఫోన్లు,10 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
వ్యభిచార నిర్వాహకులు బొమ్మరవేని సాయికుమార్,అతని భార్యకు ఎవరెవరు ఈ దందాకు సహకరిస్తున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి వద్దకు వచ్చే విటుల్లో ప్రముఖ వ్యాపారులు,ప్రభుత్వ ఉద్యోగులు,రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.గోదావరిఖని, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారిని అద్దె ఇళ్లల్లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ నగరంలో పలు వ్యభిచార ముఠాలను అరెస్ట్ చేసినా ఈ దందాకు తెరపడలేదు.