పురానాపూల్ రీపోలింగ్ ఫలితం: ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు వాయిదా
హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పురానాపూల్ డివిజన్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది.
దీంతో పురానాపూల్ డివిజన్లోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఏర్పాట్లు చేయాలని బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రేటర్ ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)ను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టంగా ప్రకటించింది. అయితే మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పురానాపూల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే.
మీర్చౌక్ పోలీస్స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, షబ్బీర్ అలీపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్, గవర్నర్లకు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పురానాపూల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీనిపై సమీక్షించిన తెలంగాణ ఎన్నికల సంఘం పురానాపూల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రీపోలింగ్ పూర్తయిన తర్వాత అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి గ్రేటర్ ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)ను ప్రారంభించనున్నారు.