ఠాగూర్ వర్ధంతి అని కాంగ్రెస్ హడావుడి, ఆ తర్వాత తిట్టుకున్నారు!
హైదరాబాద్: రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు పార్టీ కార్యాలయంలో కాసేపు హడావుడి చేశారు. ఠాగూర్ వర్ధంతి ఆగస్టు 7వ తేదీన జరుపుకుంటారు.
ఇది గమనించకుండా గురువారం నాడు హైదరాబాదులోని గాంధీ భవన్లో ఠాగూర్ వర్ధంతి అంటూ హడావుడిగా పూలు వేసి నివాళులు అర్పించారు. ఫోటో పెట్టి మరీ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు. అయితే, మధ్యాహ్నం సమయానికి పొరపాటును వారు గుర్తించారు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బంది నీవే కారణమంటే నీవే కారణమని ఒకరినొకరు తిట్టుకున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
కృష్ణాజలాల పంపిణీ మళ్లీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం పిటిషన్పై విచారణ చేపట్టింది.
కృష్ణానదీ జలాల పంపిణీలో తమకు అన్యాయం జరుగుతుందన్న తెలంగాణ వాదనలపై మహారాష్ట్ర సర్కారు అభ్యంతరం తెలిపింది.
నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం కారణంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా, ఇందులో కొత్త విషయం ఏమీ లేదని మహారాష్ట్ర తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
కృష్ణా జలాల వివాదంపై ఇప్పటికే విచారణలో ఉన్న అన్ని కేసులతో కలిపి తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై కూడా విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 26న త్రిసభ్య ధర్మాసనం ముందకు అన్ని పిటిషన్లు విచారణకు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున వైద్యనాథన్ వాదనలు వినిపించగా, మహారాష్ట్ర తరపున అంద్యార్జున్ వాదనలు వినిపించారు.