హైదరాబాద్ క'న్నీటి' వెతలు: ముగ్గురు మృతి, ఇంకా నీటిలోనే...
హైదరాబాద్: భారీ వర్షాల వల్ల హైదరాబాదు ప్రజల జనజీవితం దాదాపుగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లు నీట మునిగిపోయాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, నిజాంపేట, కుత్బుల్లాపూర్, మదినాగుడా, జీడిమెట్ల, ఆల్వాల్, కాప్రా, బేగంపేట, మల్కాజిగిరిలోని కొన్ని ప్రాంతాలు బుధవారం తెల్లవారు జామున కురుసిన భారీ వర్షానికి అతలాకుతలం అయ్యాయి.
పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం పడింది. అపార్టుమెంట్ల వద్ద రోడ్లపై మూడు నుంచి ఐదు అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. కార్లు నీళ్లలో తేలుతూ కనిపిస్తున్నాయి.
వర్షానికి సంబంధించిన సంఘటనల్లో ముగ్గురు వరణించారు. కొంపల్లిలో గోడ కూలిపోవడంతో 55 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ప్రగతినగర్లో 39 ఏళ్ల ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్తో మరణించాడు మౌలాలిలో వరదనీటిలో పడి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.
నీరు సెల్లార్స్లోకి, ఇళ్లలోకి చేరడంతో నిజాంపేట, ప్రగతినగర్ల్లోని అపార్టుమెంట్లలో నివసి్సతున్నవారు ఇళ్లకే పరిమితమయ్యారు. నీటిని పంపులు పెట్టి బయటకు తోడేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. చెరువులు పొంగిపొర్లడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నిజాంపేట సమీపంలోని బిమానీకుంటు చెరువు పొంగిపొర్లడంతో కూకట్పల్లి సమీపంలోని రాంకీ, అల్విన్, శాతవాహన కాలనీలపై తీవ్రమైన ప్రభావం పడింది. బుధవారం తెల్లవారు జామున చెరువు ఆనకట్ట తెగింది. దాంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది అక్కడికి చేరుకుని ఇసుక సంచులతో అడ్డుకట్ట వేశారు.
హైదరాబాదులోని పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు పేరుకుపోయి ఉంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ పరిశోధనాలయం అధికారులు చెబుతున్నారు.
నీట మునిగిన కాలనీలు
హైదరాబాద్ నగర శివారులోని కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాల్లో మంగళవారం మధ్య రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి అనేక కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కాలనీలు మునిగాయి. కూకట్పల్లి చెరువు ముంపు బాగంలోని కాలనీ నాలాల్లో డ్రైనేజీ పైప్లైన్ కలపడంతో తలెత్తిన నీటి ఉధృత పలు కాలనీలో ఇళ్లలోకి నీరు ప్రవహించాయి.
డ్రైనేజీ నీళ్లు కలవడంతో
కేవలం వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన కాలువల్లో డ్రైనేజీ నీటి ప్రవాహం అధికం కావడంతో చెరువు ముంపు ప్రాంతాల బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ప్రధానంగా కూకట్పల్లి చెరువువెనక ముంపుప్రాంతం నుండి భారీగా నీరు ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి.
కుత్బుల్లాపూర్లో ఇలా..
కుత్బుల్లాపూర్లో బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 23 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పరిసర ప్రాంతాల్లోని నాలాల్లో ఉవ్వెత్తున నీటి ప్రవాహం భారీగా పెరగడంతో ఆ వరదలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. హఫీజ్పేట చెరువుపొంగి పొర్లడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చైన్ లింక్ నాలాలు పూర్తిగా ఆక్రమణలకు గురికావడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెప్పారు
మల్కాజిగిరిలో ఇలా..
మల్కాజిగిరిలో 15 సెంటిమీటర్లు, కీసర, మేడ్చల్, శామీర్పేట ప్రాంతాల్లో 10 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లోని చెరువులు నిండి పొంగిపొర్లాయి. రంగారెడ్డి జిల్లా తూర్పు ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, బాలానగర్, శామీర్పేట, మేడ్చల్, కీసర, మాల్కాజిగిరి మండలాల పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కడిక్కడే జన జీవనం నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఇంటి వస్తువులన్నీ నీట మునిగాయి.
రోడ్లు జలమయం..
బుధవారం శివారు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల వాహనాలు పూర్తిగా నీట మునగడంతో ఉదయం గంటల తరబడి ట్రాఫిక్ జామైంది. కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట, బాచ్పల్లి గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
నిజాంపేటలో ఇలా..
నిజాంపేటలోని బండారి లేఅవుట్లో సుమారు 150 బహుళ అంతస్తుల భవనాలుండగా అందులో 50 అపార్ట్మెంట్ల సెల్లార్లు జలమయం అయ్యాయి. అందులోని కార్లు పూర్తిగా నీట మునిగాయి. నీట మునగడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని స్థితి నెలకొంది. ఆ నీటిని అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన బయటకు పంపేందుకు పంపింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు.
ఎక్కడికక్కడ వాహనాల నిలిపివేత
హైదరాబాదులోని పంజాగుట్ట, ఖైరతాబాద్, సచివాలయం, లిబర్టీ, మాసాబ్ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఎస్ఆర్నగర్, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, లక్డీకాపూల్, రాణిగంజ్ కూడళ్లు చిన్నసైజు చెరువును తలపించటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయి, భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కొన్ని సాఫ్ట్వేర్, ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి
నీటి మునిగాయి...
హైదరాబాదు బేగంపేటలోని బ్రహ్మణవాడి, అల్లంబావితోట, వడ్డెరబస్తీ,మయూర్ మార్గ్ ప్రాంతాలతో పాటు దేవనార్ అంథుల పాఠశాల పూర్తిగా నీటిలో మునిగిపోయింది. శివారు ప్రాంతాల్లో ఎక్కువ మోతాదులు వర్షపాతం నమోదు కావటంతో చెరువులు, కుంటలు, నాలాలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. దాంతో కూకట్పల్లి, పికెట్ నాలా ద్వారా ఎక్కువ మొత్తంలో వరద నీరు హుస్సేన్సాగర్కు చేరింది.
హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాలు
హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాలైన అశోక్నగర్, గాంధీనగర్, చిక్కడపల్లి, ఫీవర్ ఆసుపత్రి, గోల్నాక తదితర ప్రాంతాల్లో హుస్సేన్సాగర్ నాలాకు ఇరువైపులా ఉన్న ఇళ్లలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేక సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక పునరావాసాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
సిసి కెమెరాలతో సహాయక చర్యలు
కొద్దిరోజుల క్రితం నగరంలో జరిగిన వినాయక నిమజ్జనం కోసం నగరంలో నిత్యం రద్ధీగా ఉండే కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో వర్షం సహాయక చర్యలను జిహెచ్ఎంసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోని ఫేస్ టు ఫేస్ హాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో అధికారులు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తూ ఎక్కడెక్కడ వర్షం ఎలా కురుస్తుంది.
200 బృందాలు..విధి నిర్వహణలో 25వేల మంది
వర్షాకాలం కష్టాలను నివారించేందుకు 200 బృందాలుగా దాదాపు 25వేల మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు క్షేత్ర స్థాయి విధుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో 96 బృందాలు రోడ్లపై ఏర్పడే గుంతలను అప్పటికపుడే పూడ్చే విధులు నిర్వహిస్తున్నాయని, మరో 119 బృందాలు ఎక్కడైనా చెట్లు, విద్యుత్ తీగలు విరిగిపడినా, వాటిని సకాలంలో తొలగించి ట్రాఫిక్ అంతరాయమేర్పడకుండా చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.
సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు
హైదరాబాదు నగరంలో భారీగా వర్షం కురిసే ప్రాంతాలపై నాలుగు సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికపుడు వరద నీటి ప్రవాహ ఉద్దృతిని పర్యవేక్షించి, అవసరమైన చోట అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. జిహెచ్ఎంసితో పాటు జలమండలి, హెచ్ఎండిఏ, విద్యుత్, రెవెన్యూ,హైదరాబాద్ మెట్రోరైలు, జాతీయ రహదారుల విభాగాలకు చెందిన అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.
జిహెచ్ఎంసి యాప్
వర్షంతో
తలెత్తిన
ఇబ్బందులను
నివారించేందుకు,
అత్యవసర
సహాయం
కోసం
నగరవాసులు
డయల్
100,
21111111కు,
మై
జిహెచ్ఎంసి
యాప్కు
గానీ
ఫిర్యాదు
చేయవచ్చునని
ఆయన
సూచించారు.
నీటి
మునిగిన
లోతట్టు
ప్రాంతాలు
ప్రజలు,
హుస్సేన్సాగర్
సర్ప్లస్
నాలాకిరువైపులా
ఉన్న
ఇళ్లలో
నివసిస్తున్న
వారికోసం
తాత్కాలిక
పునారావాస
కేంద్రాలను
ఏర్పాటు
చేసినట్లు
కమిషనర్
జనార్దన్
రెడ్డి
తెలిపారు.