రాజయ్య అదేమాట, కేసీఆర్కి వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్: తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య బుధవారం పునరుద్ఘాటించారు. తాను తెరాసలోనే కొనసాగుతానని, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు.
నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పదవీ త్యాగం చేశానని, నేడు బంగారు తెలంగాణ కోసం ద్వితీయ స్థాయి స్థానాన్ని వదిలి పెట్టానని, ఈ దిశగా పని చేసేందుకు తెరాసలో సామాన్య కార్యకర్తగా ఉండేందుకు సిద్ధమన్నారు.
ఛాతి నొప్పితో మంగళవారం సాయంత్రం అపోలోలో వైద్య చికిత్సలు చేయించుకొన్న రాజయ్య, తదుపరి పరీక్షల కోసం బుధవారం ఉదయం మరో పర్యాయం ఆస్పత్రికి వచ్చారు. మధ్యాహ్నం 1.30వరకు ఆస్పత్రిలోనే ఉండి పరీక్షల అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు.

ఆయన బయటకు వస్తున్న సమయంలో.. రాజయ్య అనుచరులు ఆయనకు అనుకూలంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై జై రాజయ్య... డౌన్డౌన్ కేసీఆర్ అంటూ పెద్దఎత్తున నినదించారు. ఆస్పత్రి ముందు బైఠాయించారు. వారిని వారించేందుకు రాజయ్య ప్రయత్నించారు.
వైద్యఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఉద్యోగుల వల్ల ఏమైన పొరపాట్లు జరిగి ఉంటుందని, ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్న కేసీఆర్, తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో చర్య తీసుకుని ఉంటారని, అయితే అవీఇవీ అన్నీ విచారణలో తేలుతాయని రాజయ్య అన్నారు. అందువల్ల వెంటనే కమిటీని వేసి తనపై విచారణ జరిపించాలన్నారు.
తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా భయటపడతానన్నారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగయిందన్నారు. మిమ్మల్ని కలిసేందుకు తెరాస నేతలు ఎవరు రాలేదని కదా అని ప్రశ్నించగా.. గువ్వల బాలరాజు తదితరులు వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications