రామ్నాథ్కు ఘనస్వాగతం: పాదాభివందనం చేసిన జగన్, వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిమిత్తం ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిమిత్తం ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, బీజేపీ నేతలు తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్ బీజేపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతలతో రామ్ నాథ్ వేర్వేరుగా భేటీ అవుతున్నారు. హరిత ప్లాజాలో బీజేపీ, టీడీపీ నేతలతో రామ్ నాథ్ భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నేతలు మురళీధరరావు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ బేటీలో పాల్గొన్నారు.
ఆహ్వానం అందని కారణంగా రాజాసింగ్ లోద్ హాజరుకాలేదు. కాగా, మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన విందు కార్యక్రమంలో రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు.
కోవింద్కు పాదాభివందనం చేసిన జగన్: సోషల్ మీడియాలో వైరల్
అంతకుముందు పార్క్ హయత్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రామ్ నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రామ్ నాథ్ కోవింద్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశారు.
కాగా, ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు.. రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్కు పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.