20ని.ల్లో కేటీఆర్ బొందపెట్టారు, టీఆర్ఎస్కు 30 సీట్లు రావు, అది వర్షం కాదు కన్నీరు: రాములు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో తన 20 ఏళ్ల సేవలను కేవలం ఇరవై నిమిషాల్లోనే కేటీఆర్ బొందపెట్టారని ఆ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్టలా ఉందని విమర్శించారు. హైదరాబాదులో కురిసింది వర్షం కాదని, కేసీఆర్ మేనిఫెస్టోలో మోసపూరిత వాగ్ధానాలు చూసి తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన 1200 మంది అమరులు కన్నీరు అన్నారు.
మరో షాక్: కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్!, వేటు పడింది
హామీలు కాళేశ్వరంలో, నియామకాలు కేసీఆర్ కుటుంబంలో
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన పోరాట స్ఫూర్తిని విస్మరించిన టీఆర్ఎస్, ఆ వాగ్దానాలు కాళేశ్వరం ప్రాజెక్టులో కలుపుతోందన్నారు. నిధులన్నీ టీఆర్ఎస్ ప్రయివేటు లిమిటెడ్ పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయని, నియామకాలు కేసీఆర్ కుటుంబంలో నలుగురైదుగురికి చెందాయన్నారు. మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్ల అంశం ప్రస్తావన లేదన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండాలు, గిరిజన గూడేల ఊసేలేదన్నారు.
కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెట్టారని సంచలన ఆరోపణ
మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల అని రాములు నాయక్ అన్నారు. తనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా అహంకారంతో తనను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. తండాలు, గూడేలకు ఓ బోర్డు ఏర్పాటు చేయాలంటే పట్టించుకోలేదన్నారు. రెండు కులాల మధ్య ఏ సీఎం చిచ్చుపెట్టలేదని, గోండులకు - లంబాడాలకు, యాదవులకు - కురుమలకు, బెస్తలకు - ముదిరాజ్లకు కేసీఆర్ చిచ్చు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.
టీఆర్ఎస్కు 30 సీట్లు రావు, నార్కో టెస్టులు చేయించుకుందామా?
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని రాములు నాయక్ చెప్పారు. 25 నుంచి 30 సీట్లకు మించి ఆ పార్టీకి రావన్నారు. టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో డెబ్బై మంది కుంటి గుర్రాలేనని ఎద్దేవా చేశారు. తాను కాంగ్రెస్ నేతలను కలిసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. ఎవరు ఎవరితో కలిసారో నార్కో టెస్టులు చేయించుకుందామా అని సవాల్ చేశారు. తనకు టిక్కెట్ అవసరం లేదని, కావాల్సింది గిరిజనులకు రిజర్వేషన్లు అన్నారు. గత ఎన్నికల్లోనే కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
మాకు ఏం జరిగినా కేసీఆర్దే బాధ్యత
నారాయణ్ఖేడ్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, భూపాల్ రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, ఒకవేళ తాను ఓడిపోతే ఉరేసుకుంటానని సవాల్ రాములు నాయక్ విసిరారు. రేపటి తనపై భౌతిక దాడులు జరుగుతాయని, ప్రెస్మీట్ల ద్వారా విమర్శలు చేయిస్తారని ఆరోపించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.
Recommended Video
లంబాడీల్లో ఎందరో ఉద్యమించినా రాములుకు కేసీఆర్ పదవి
పదవి ఇచ్చి గౌరవించిన కేసీఆర్కు రాములు నాయక్ నమ్మక ద్రోహం చేశారని, పైగా విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ మండిపడ్డారు. రాములు వెంట గిరిజనులు ఎవరూ లేరన్నారు. ఆయన నిజస్వరూపాన్ని అందరూ గుర్తించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది గిరిజనులు క్రియాశీలక పాత్ర పోషించినా కేసీఆర్ మాత్రం రాములునాయక్కు పదవి ఇచ్చి, ప్రోత్సహించారన్నారు.