రమ్య మృతి: దిక్కుమాలిన తాగుడని జేసీ ఆగ్రహం, 'పదేళ్ల జైలు'
హైదరాబాద్: చిన్నారి రమ్య మృతి పైన టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దిక్కు మాలిన తాగుడు కల్చర్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని మండిపడ్డారు. మైనర్ విద్యార్థులు తాగుతున్నారంటే తల్లిదండ్రుల పెంపకాన్ని నిందించాలన్నారు.
నిందితులకు కనీసం పదేళ్ల శిక్షకు తక్కువ కాకుండా పడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనల్లో నిందితులను కోర్టులకు ఎట్టి పరిస్థితుల్లోను వదలకూడదని, నేరుగా ప్రజలకు వదలాలని వ్యాఖ్యానించారు. ప్రజలే వారు ఎలా ఉండాలనేది నిర్ణయిస్తారన్నారు.
లాయర్లు నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోకూడదని సూచించారు. ఏం తెలియని బాలిక అకారణంగా మృతి చెందిందంటే దానికి ఎవరిని నిందించాలన్నారు. అందులో తల్లిదండ్రులు, మద్యం బార్ యజమాని, విద్యార్థులు అందరూ దోషులేనని చెప్పారు.
హైదరాబాదులాంటి గ్లోబల్ సిటీలో అడవి జంతువుల్లా ప్రవర్తిస్తున్నామని సినీ నటుడు శివాజీ అన్నారు. చిన్నారి రమ్య మృతికి సంతాపంగా హైదరాబాదులో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. అవసరం ఉన్నా లేకున్నా గమ్యాన్ని తొందరగా చేరుకోవాలన్న ఆలోచనతో అడవిలో జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
చిన్నారి రమ్య కుటుంబసభ్యులు కొద్దిగా కోలుకున్న తర్వాత వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రమ్య కేసులో నిందితుడికి పదేళ్ల శిక్ష పడే అవకాశాలున్నాయన్నారు.
అదేవిధంగా మిగిలిన వాళ్లపై కూడా కేసు పెట్టే అవకాశాలున్నాయేమో తెలుసుకునేందుకు గాను చట్టపరమైన సలహాలు తీసుకుంటామన్నారు. దేశంలోనే హైదరాబాద్ పోలీస్ నంబర్ వన్గా ఉన్నారని, డ్రంకెన్ డ్రైవ్ కేసులలో పెద్ద పెద్ద వాళ్లనే పట్టుకుంటున్నారన్నారు. 16, 17 సంవత్సరాల కుర్రాళ్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఈ విషయమై చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నామన్నారు.
చిన్నారి రమ్య మృతి పైన టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దిక్కు మాలిన తాగుడు కల్చర్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని మండిపడ్డారు. మైనర్ విద్యార్థులు తాగుతున్నారంటే తల్లిదండ్రుల పెంపకాన్ని నిందించాలన్నారు.