రేషన్ డీలర్లకు, లబ్దిదారులకు తీవ్ర హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్దిదారులకు, రేషన్ డీలర్ లకు పౌర సరఫరాల శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేస్తుంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చిన క్రమంలో చాలామంది నిరుపేదలు వాటిని తినకుండా బయట అమ్ముకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తినటానికి పనికి వచ్చే విధంగా పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తోంది. అయినా ఆ పథకం ఆశయం దారి మళ్లుతోంది.
వారికి అదనపు ఆదాయంగా రేషన్ బియ్యం
రూపాయి లేకపోయినా పేదవాడు ఆకలితో అలమటించకూడదని ఉచితంగా బియ్యం ఇస్తుంటే, ఆ లబ్ధి అక్రమార్కుల పాలిట కాసుల పంటగా మారుతోంది. అర్హులైన పేదల కడుపు నింపాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్ వ్యాపారుల జేబులు నింపుతోంది. ప్రస్తుతం చాలా చోట్ల రేషన్ కార్డు ఉన్నవారు బియ్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు.

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బియ్యం కొంటున్న దళారులు
ప్రతి నెల లేదా మూడు నెలల కోటా పంపిణీ మొదలవగానే లబ్ధిదారుల ఇళ్ల ముందు దళారులు ప్రత్యక్షమవుతున్నారు. ప్రభుత్వం అందించిన నాణ్యమైన బియ్యాన్ని ఇంట్లో ఉంచుకోవాల్సిన పేదలు కేవలం ఐదు-పది రూపాయల ఆశకు లోనై వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కొన్ని చోట్ల దందా మరింత ముందుకెళ్లింది. బియ్యం సంచులను ఇళ్లకు తీసుకెళ్లకుండానే షాపు వద్ద వేలిముద్ర వేసి, అక్కడే వదిలేసి కిలోకు రూ.10 నుంచి రూ.15 తీసుకుని వెళ్లిపోతున్నారు.
పక్కదారి పడుతున్న రేషన్ సన్నబియ్యం
ఇలా మిగిలిన బియ్యాన్ని రేషన్ డీలర్లు, దళారులు చీకటి పడగానే గోదాములకు లేదా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొన్ని రేషన్ షాపుల్లో డీలర్లు స్థానిక హోటళ్లకు అమ్మేస్తున్నట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో కేజీకి రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ప్రభుత్వ లక్ష్యం ఇక్కడ తీవ్రంగా నీరుగారిపోతోంది.
లబ్దిదారులు బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు శాశ్వతంగా రద్దు
ఈ దందాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు కఠినతరం చేశారు. ఉచితంగా ఇచ్చే సన్నబియ్యాన్ని బయట మార్కెట్లో అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. లబ్ధిదారులు బియ్యం అమ్ముకున్నట్లు ఆధారాలతో నిరూపణ అయితే వారి రేషన్ కార్డును శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్తున్నారు. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగిస్తామని చెప్తున్నారు.
డీలర్ల లైసెన్సులు రద్దు.. క్రిమినల్ కేసులు
ఆకస్మిక తనిఖీల్లో బియ్యం నిల్వల్లో తేడాలు వచ్చినా, రీసైక్లింగ్ దందాలో భాగస్వామ్యమైనా డీలర్ల లైసెన్సులను రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కేవలం ఆకలి తీర్చుకోవడానికే ఉపయోగించాలి. వ్యాపార వస్తువుగా మార్చి చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవద్దని అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారులు, డీలర్లు ఈ హెచ్చరికను పాటించకుంటే చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరిక చేస్తున్నారు.












Click it and Unblock the Notifications