ఐటీ కారిడార్ను వదల్లేదు: నయీం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిగుస్తోన్న ఉచ్చు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను యజమానులు, రైతుల వద్ద నుంచి బెదిరించి లాక్కుని వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టినట్లుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ బెదిరింపుల వెనుక నయీం గ్యాంగ్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందని సమాచారం. వీరంతా కూడా కోబ్లా ముసుగు సభ్యులుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో సుమారు 12 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
వీరంతా తపంచా, పిస్టల్స్ ఉపయోగించి బెదిరింపులకు సైతం దిగేవారని తెలుస్తోంది. ఉప్పల్, హయతనగర్, ఎల్బీనగ ర్, ఆదిభట్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం తదితర ప్రాంతాల్లో రియల్ ఏజెంట్లుగా జీవితం ప్రారంభించిన వీరు.. నయీం నీడలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ఆస్తిపంపకాలు, వారసత్వ గొడవలు, సరైన పత్రాలు లేని భూముల సమాచారాన్ని సేకరించేవారు. భవిష్యత్తులో భారీ ధర పలుకుతుందనుకున్న భూముల గురించి తెలిస్తే ఏమాత్రం ఆలస్యం చేసేవారు కాదు. ఏజెంట్లు రంగంలోకి దిగి భూయజమానులతో రాయబేరాలు సాగించేవారు.
తక్కువ ధరకు విక్రయించమంటూ భూ యజమానులపై ఒత్తిడి తీసుకొస్తారు. భూమి అమ్మమని ఎదురు తిరిగితే బాయ్ దగ్గరకు వెళతారా! అంటూ బెదిరించేవారు. ఇలా హయతనగర్, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విలువైన 30 ప్లాట్లను ఓ రియల్ వ్యాపారి సొంతం చేసుకున్నట్టు సిట్ విచారణలో వెల్లడైంది.
నయీం ఎన్ కౌంటర్కు కొన్ని నెలల ముందు ఐటీ కారిడార్కు సమీపంలోని ఆదిభట్ల వద్ద కూడా ఇలాగే ముగ్గురి వద్ద నుంచి సుమారు 12 ఎకరాల వరకు నయీం అనుచరులమంటూ బెదిరించి తక్కువ రేటుకే బెదిరించి లాక్కున్నట్లుగా తెలుస్తోంది.
మేడ్చల్ వద్ద 15 ఎకరాల పొలం పంపకంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇదే బృందం అవకాశంగా తీసుకున్నట్లు సమాచారం. తాము నిర్దేశించిన ధరకే చెప్పిన వ్యక్తులకు విక్రయించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇదే సమయంలో నయీం ఎన్కౌంటర్ జరగడంతో బెదిరింపులకు దిగిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉంచారు. పోలీసుల వద్ద ఉన్న జాబితా ఆధారంగా బాయ్ పేరు చెప్పి దందాలు సాగించిన వారంతా.. అసలా! నకిలీయా! అనేది తేలాల్సి ఉంది. నయీం కేసు దర్యాప్తునకు ఏర్పాటైన సిట్ నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సామ సంజీవరెడ్డితో నయీంకు సంబంధాలున్నట్లు నిర్ధారించింది.