బీజీపీ ఛీఫ్గా బండి సంజయ్ తొలగింపు పార్టీకి లాభమా నష్టమా..?
అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు అధ్యక్షులను మార్చింది బీజేపీ అధిష్టానం. తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో జి. కిషన్రెడ్డిని, ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరిలను ఎంపిక చేసింది. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని, ఆంధ్రప్రదేశ్లో బలమైన కమ్మ సామాజికవర్గాన్ని ఎంపిక చేసింది.
బీజేపీ గ్రాఫ్ పెంచిన బండి సంజయ్ : నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అప్పటివరకు మందకొడిగా సాగుతున్న బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలతో మొత్తానికి పార్టీ గ్రాఫ్ పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పోటా పోటీగా బీజేపీ పోటీ పడేలా చేయడంలో బండి సంజయ్ పాత్ర కీలకమైనదనే చెప్పాలి. రెండు సార్లు పాదయాత్ర చేసిన బండి సంజయ్కి అధిష్టానం కూడా అంతే స్థాయిలో మద్దతిచ్చింది.

ప్రతి పాదయాత్ర ముగింపుకు పార్టీ పెద్దలు వచ్చారు. రెండు మూడు సమావేశాల్లో స్వయంగా ప్రధాని మోదీ హాజరై, శభాష్ అంటూ భుజం తట్టారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబసభ్యులపై ఒంటికాలితో లేచే బండి సంజయ్ పనితీరు సగటు బీజేపీ కార్యకర్తల్లో జోష్ పెంచింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ అని ఒకసారి, లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు ఎందుకు చేయకూడదో చెప్పాలంటూ ప్రశ్నించి బండి సంజయ్ ఏదో ఒకరకంగా వార్తల్లో ఉంటూ వచ్చారు.
అలాంటి సంజయ్ని కాదని, సౌమ్యుడుగా పేరున్న జి. కిషన్రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం పట్ల బీజేపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుజ్జల శ్రీనివాస్ అనే కార్యకర్త ఏకంగా ఆత్మహత్యా యత్నమే చేశాడు. బీజీపీ అధ్యక్షుడి మార్పు వల్ల అంతిమంగా ఎన్నికల్లో బీఆర్ ఎస్ లాభపడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కిషన్రెడ్డి ఎంపికవల్ల కాంగ్రెస్వైపు మెజార్టీగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఓట్లు కొంత శాతం బీజేపీకి పడే అవకాశముందని, ఇది కేసీఆర్ గెలుపుకు కలిసొస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications