సీఎం కేసీఆర్పై మానసికంగా రేవంత్ ఆధిక్యం.. కొడంగల్కు వరాల ప్రభావమిదే!
హైదరాబాద్: ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగానే అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు పుడుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిలువరించే లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ నాయకత్వం కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిదిలో వ్యూహాలు రచిస్తోందా? రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్పై కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి మానసికంగా విజయం సాధించారా? అంటే పరిస్థితులు అవుననే చెప్తున్నాయి.
రెండు రోజుల క్రితం కొడంగల్ పరిధిలో వివిధ అభివ్రుద్ధి పనులు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అభ్యర్థించిన మరుక్షణమే సీఎం కేసీఆర్.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే దీనికి నిదర్శనం. ఒకవైపు రాజకీయంగా కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలోని కాంగ్రెస్, టీడీపీ శ్రేణులను తమ వైపునకు తిప్పుకోవడం ఒకటి. మరోవైపు నియోజకవర్గ పరిధిలో వివిధ అభివ్రుద్ధి పథకాలు అమలు చేసేందుకు వరుసగా పథకాలను, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తోంది.

కొడంగల్ ప్రగతి కోసం ఇలా అభ్యర్థనల వినతి పత్రం
గమ్మత్తేమిటంటే రెండు రోజుల క్రితం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ శాసనసభ్యుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ నేత గుర్నాధ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రగతి భవన్లో కలుసుకుని వివిధ రకాల అభివ్రుద్ధి పనులు చేపట్టాలని మెమోరాండం సమర్పించారు. ఆయనతోపాటు సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు జూపల్లి క్రుష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పీ నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

ఫైర్ స్టేషన్ ప్లస్ పోలీస్ సర్కిల్ ఏర్పాటుకు ఆదేశం
గుర్నాథరెడ్డి మెమొరాండం సమర్పించిందే తరువాయి అన్నట్లు కొడంగల్ అసెంబ్లీ స్థాన పరిధిలో ఒక బస్సు డిపో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఫైర్ స్టేషన్, జూనియర్ కళాశాలలు, ఒక పోలీస్ సర్కిల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయడంతోపాటు పథకాలు వేగిరంగా అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కేసీఆర్పై మానసికంగా రేవంత్పైచేయి సాధించారని అభిప్రాయాలు
ఈ కార్యక్రమాలు వినియోగంలోకి వస్తే తమకు ఓట్లు కుమ్మరిస్తాయని అధికార టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై మానసికంగా తమ నాయకుడు రేవంత్ రెడ్డి పైచేయి సాధించారని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే అనూహ్య మార్పు
మూడున్నరేళ్లుగా రేవంత్ రెడ్డి పలు వినతిపత్రాలు సమర్పించినా, అసెంబ్లీలో లేవనెత్తినా సీఎం కేసీఆర్ పట్టించుకున్న దాఖలాలే లేవు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచినా కొద్దీ అధికార పక్షంలో వణుకు పుట్టిస్తున్నారా? అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగమేఘాలపై సీఎం కేసీఆర్.. ఆయా పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గుర్నాథరెడ్డి పనితీరుపై విమర్శలు
కానీ ఈ క్రెడిట్ ఎంతమాత్రం సీఎం కేసీఆర్కు గానీ, టీఆర్ఎస్ నాయకులకు చెందదని రేవంత్ రెడ్డికి సన్నిహిత కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఆ మాటకు వస్తే ఐదుసార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన గుర్నాథరెడ్డి ఏనాడూ నియోజకవర్గ అభివ్రుద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కొడంగల్ ప్రగతిపట్ల గుర్నాథరెడ్డి పట్టుదల ఇన్నాళ్లు ఎటు వెళ్లింది?
2004 ముందు వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుర్నాథ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలవ్వడం గమనార్హం. 2019లోనైనా రేవంత్ రెడ్డిని ఢీకొట్టి విజయం సాధించాలన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్న గుర్నాథరెడ్డి అంచనాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ముందుకెళుతుందా? అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివ్రుద్ధి పట్ల గుర్నాథరెడ్డికి పట్టుదల ఉంటే మూడున్నరేళ్లుగా ఎక్కడకు వెళ్లిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఊరూరా కాంగ్రెస్ పార్టీకి దండిగా కార్యకర్తల బలం
ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి 2019 ఎన్నికల్లో.. తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరిలోగా జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయే. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన నేతగా.. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు భావోద్వేగ పూరిత ప్రచారోద్యమానికి దాసోహం అన్నది తెలంగాణ సబ్బండ సామాజిక వర్గం. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఇప్పటికీ పల్లెపల్లెనా అభిమానులు, కార్యకర్తల అండ పుష్కలంగా ఉన్నది. సొంతంగా పార్టీకోసం పని చేసే సత్తా కాంగ్రెస్ పార్టీ నేతలకు సొంతం. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ ప్రతి పల్లెలోనూ చెప్పుకోదగిన రీతిలో కార్యకర్తల దన్ను లేనేలేదు. కాకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాలు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకింత పట్టు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.

ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీఆర్ఎస్ వ్యూహాలిలా..
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎదుర్కొనే నాయకులే కరువు అయ్యారు. ఎవరికి వారు యమునాతీరే అన్నట్లు వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసినందున తమదే అధికారం అన్నట్లు సంకేతాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

కాంగ్రెస్ నేతల వ్యంగ్యాలతో టీఆర్ఎస్ పార్టీకి ఇలా మేలు
2004 నుంచి.. 2008 నుంచి సార్వత్రిక, ఉప ఎన్నికల ద్వారా ప్రజలకు దగ్గర కావడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. నాటి పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య వ్యంగ్యపూరిత, హేళనాభరితమైన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీకి మేలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళ్లడంలో టీఆర్ఎస్, కేసీఆర్ సక్సెస్ అయినందువల్లే 63 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందడమే కాదు.. కాంగ్రెస్ పార్టీలో 20 మంది మాత్రమే గెలుపొందారు.

2017లో ఇలా కాంగ్రెస్ పార్టీ గూటికి రేవంత్
2014లో తెలంగాణలో నాటి టీడీపీ నాయకుడిగా రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలతో ప్రజల్లోకి దూసుకెళ్లారు. అయితే 2015లో దూకుడు వల్ల ఓటుకునోటు కేసులో ఇరుక్కున్నా.. బెయిల్పై బయటపడ్డారు. కానీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటంతో రేవంత్ రెడ్డి.. టీడీపీలో కొనసాగడం కష్ట సాధ్యంగా పరిణమించింది. ఇది ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీలోకి పలువురు సీనియర్లతో ‘మాజీ ఎమ్మెల్యేల'తో టీడీపీ నుంచి వీడటం టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన రేకెత్తెంచింది.

రాష్ట్రస్థాయికి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యం
దీన్ని తొలిదశలోనే ఎదుర్కోవాలన్న వ్యూహంతో టీఆర్ఎస్ వెళుతున్నది. దీని లక్ష్యాలు కూడా స్పష్టమే. కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలోనే రేవంత్ రెడ్డిని నిలువరించడం మొదటి లక్ష్యం. కొడంగల్లోనే ఓడించగలిగితే రాష్ట్రస్థాయిలో తమను ఢీకొట్టే సామర్థ్యం రేవంతుడికి లేవన్న సంకేతాలివ్వడం అధికార టీఆర్ఎస్ మరో (ప్రధాన) లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications