ATM నుంచి కేసీఆర్ ఎంత డ్రా చేశారో తెలుసా?
కాళేశ్వరం ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవే ఆరోపణలు చేస్తున్న బీజేపీ కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఆయన అవినీతిపై వివరాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. బంగారు కూలీ పేరుతో టీఆర్ఎస్ కోట్లరూపాయలు వసూలు చేసిందని అయినా ఇంతవరకు ఈసీ ఎటువంటి చర్యా చేపట్టలేదని ఆరోపించారు. గాంధీభవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
తొడుక్కోవడానికి అంగీలు కూడా లేవు?
తొడుక్కోవడానికి అంగీలు కూడా లేని కార్యకర్తలున్న టీఆర్ ఎస్ పార్టీకి రూ.800 కోట్ల పైబడిన నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ముందస్తు ఒప్పందంలో భాగంగానే ఢిల్లీలో అత్యంత ఖరీదైన స్థలంలో జాతీయ పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చారన్నారు. ఈడీని ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా బీజేపీ మార్చేసిందని, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, గాలి అనిల్ కుమార్ లాంటి నాయకులకు ఈడీ నోటీసులిచ్చిందని తెలిపారు. వీరంతా పార్టీలో యాక్టివ్ గా ఉంటారని, వీరిని భయపెట్టి పార్టీలో చేర్పించుకోవడానికే ఈడీ నోటీసులిచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రాల్లోని నేతలందరికీ ఈడీ నోటీసులు!
రాహుల్ గాంధీ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఖాయమని, దీనికి భయపడే భారత్ జోడో యాత్రను అడ్డుకోవడానికి రాహుల్ కు ఈడీ నోటీసులిచ్చారని, సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా విచారణకు పిలిచారని గుర్తుచేశారు. ఎంత చేసినా జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల్లోని నేతలందరికీ నోటీసులిస్తున్నారని, కర్ణాటకలో యాత్రను అడ్డుకునేందుకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఢిల్లీలో విచారణకు పిలిచారన్నారు.
6 సంవత్సరాల్లో బీజేపీకి చందా రూ.4841 కోట్లు!
గత ఆరు సంవత్సరాల్లో భారతీయ జనతాపార్టీకి రూ.4841 కోట్లు చందాలుగా వచ్చాయని, ఆ పార్టీకి చందాలిచ్చిన ఏ వ్యక్తికీ ఐటీ నోటీసులు రాలేదన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కోటిరూపాయల చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులిచ్చారన్నారు. వారిని భయపెట్టి యాత్రలో పాల్గొనకుండా చూడాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనోస్థైర్యాన్ని బీజేపీకానీ, ఈడీ కానీ దెబ్బతీయలేవనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తెరగాలన్నారు.