రేవంత్ రెచ్చగొట్టారా?: కెసిఆర్, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు ఇవీ..
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయి, బెయిల్పై విడుదలైన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై, ఆయన మంత్రులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో అత్యాచారం నిందితుడిని ప్రజలు తొక్కి చంపేసినట్లుగా కెసిఆర్ కుటుంబాన్ని రాజకీయ సమాధి చేస్తానని అన్నారు. లాగులు తడస్తాయని వ్యాఖ్యానించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి పార్టీ కోసం నిలబడ్డారని, పార్టీ రేవంత్ రెడ్డి కోసం నిలబడుతుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై, నిర్వహించిన ర్యాలీపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ స్థితిలో ఆయన వ్యవహారం, చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ రెడ్డి బెదిరించారంటూ తెలంగాణ ఎసిబి సుప్రీంకోర్టుకు నివేదించింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో ఆ ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రవర్తించిన తీరు, చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రేవంత్ రెడ్డి కెసిఆర్పై, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి....
- ఈ రోజు నుంచి టీఆర్ఎస్ నేతలకు లాగులు తడుస్తాయి. రేవంత్ జైల్లో ఏడుస్తున్నాడా అని టీఆర్ఎస్ మంత్రులు అని జైలు అధికారులను అడిగారట! నేను స్కామ్ ఫైళ్లు చదువుతున్నానని, బయటకు వస్తే మీ పని పడతారని జైలు అధికారులు మంత్రులకు చెప్పారు. నిన్న నాకు బెయిల్ వచ్చింది. కేసీఆర్కు జ్వరం రావడం మాత్రమే కాదు! లాగు తడుస్తోంది
- రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన మొట్టమొదటి సంతకంతోనే మైహోం రామేశ్వరరావుకు 3 వేల కోట్ల భూమిని అక్రమంగా కట్టబెట్టారు. దీనిని నేను ప్రశ్నించాను. మెడికల్ ఫీజులు అడ్డగోలుగా పెంచడంపై హైకోర్టులో కేసు వేశాను. కేసీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెబుతుంటే నిలదీశాను. అందుకే, నాపై కుట్రపన్ని కేసులో ఇరికించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ నాపైనే ప్రయోగించారు. చర్లపల్లి జైలులో 30 రోజుల పెడితే నేను లొంగిపోతానుకుంటే అది కేసీఆర్ భ్రమే.
- మిస్టర్ కేసీఆర్! 30 రోజుల జైలు జీవితం... అవసరమైతే నీ కుటుంబంపై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తాను
- జైలులో ఇచ్చిన టీవీలో దూరదర్శన్ తర్వాత వచ్చేది ఏబీఎన్ చానలే. తెలంగాణ రాష్ట్రంలో నీవు నిషేధించిన చానల్ను జైలులో చూశాం. నీ బతుకును బయటపెట్టినందుకు ఏబీఎన్ గొంతుకోశావు. అదే ముసుగులో ఒక చానల్ను బెదిరించి నీ బినామీ పేర్లతో వాటాలు రాబట్టుకున్నావు. వాటిన్నంటిని మేము బయట పెడతాం
- గతంలో టీడీపీని లేకుండా చేస్తానన్నవ్యక్తి 48 గంటల్లో పావురాల గుట్టలో పావురమై పోయాడు. (వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి)
- దుబాయ్కి జనాన్ని పంపిస్తానని మోసం చేసినట్లు కేసులు నమోదైతే ఢిల్లీలో ఎమెస్సార్ ఇంట్లో దాక్కున్నారు. ఆయన ఇప్పుడు పెద్ద ఉద్యమకారుడా! తెలంగాణ జాతిపితా! వీళ్లు తెలంగాణ తెస్తే... బలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థులు ఎవరు?
- ఆలుగడ్డలవాడు, గోచి పెట్టుకునేవాడు, అమ్మలాంటి పార్టీని అమ్ముకునేవాడు, లంబూ... గ్లాసులు మోసే వాళ్లు, సోడాలు కలిపేవారు మంత్రులుగా ఉన్నారు.
- ఇటీవల ఏలూరులో ఒక బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని అక్కడివారు తొక్కి చంపినట్లే కేసీఆర్ కుటుంబాన్ని కూడా తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి చేస్తారు. కెసిఆర్ను గద్దె దింపడమే నా ఏకైక లక్ష్యం.
- సోడాలు కలిపేవాళ్లు, మోండా మార్కెట్లో ఆలుగడ్డలు అమ్మే వ్యక్తులు మంత్రులయ్యారని, సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారు.
- రాజకీయాల్లోకి రాక ముందు మేనమామ ఇంట్లో రబ్బరు చెప్పులు వేసుకుని, చాయ్ కప్పులు ఎత్తేవానికి, మేనమామ గత చరిత్ర తెలియదు. ఇంటికెళ్లి మామ పదవులు రాకముందు ఏం చేసేవాడో తన తల్లిని అడుగు.. అప్పడామె... మీ మేనమామ గల్ఫ్ ఏజెంట్ అని, విదేశాలకు జనాలను తరలించేవాడని చెబుతుంది. (హరీష్ రావును ఉద్దేశించి..)