మారిన వ్యూహం: రేవంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటుకే టిఆర్ఎస్ మొగ్గు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అనర్హత వేటు పడే వరకు వేచి చూడాలని భావించిన టిఆర్ఎస్ వ్యూహం మార్చుకుని వచ్చే శాసనసభ సమావేశాల్లోనే సస్పెన్షన్ వేటు వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి అవసరమైన చర్యలు ఉంటాయని అంటున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలైనా సరే, ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చేదిలేదనే ఉద్దేశంతో టిఆర్ఎస్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, కోర్టులో కేసు నడుస్తుండగా ఆయనపై అసెంబ్లీలో చర్యలు తీసుకునే వీలుందా అనే దిశలో టిఆర్ఎస్ ఆలోచన చేస్తోంది.
అసెంబ్లీలో చర్యలు తీసుకోవడానికి, కోర్టు కేసుకు అసలు సంబంధమే ఉండదని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్న అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిపి, తీర్మానాలు చేసి, నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులు కూడా టీఆర్ఎస్కు తమ అభిప్రాయం చెప్పినట్లు సమాచారం.
సభ్యుడి సస్పెన్షన్ అనేది పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ ముడుపుల కేసులో దొరికిపోయి ప్రజాప్రాతినిధ్యానికి భంగం కలిగించారనే కారణంతో రేవంత్ రెడ్డిపై సస్పెన్షన్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు.