జైలు వద్దకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు: విడుదల, ర్యాలీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ స్థితిలో ఆయన కుటుంబ సభ్యులు జైలు వద్దకు వచ్చారు. బంధువులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జైలు వద్దకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డిని ర్యాలీగా జైలు సమీపం నుంచి వారు తీసుకుని వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర నిందితులు ఉదయసింహ, సెబాస్టియన్ కూడా విడుదలయ్యారు.
రేవంత్ రెడ్డిని కార్యకర్తలు ఓపెన్ టాప్ జీపులో ఎక్కించారు. బాణసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జైలు వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ర్యాలీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకుంటుంది.
కుటుంబ సభ్యులు రావడంతో జైలు హడావిడి నెలకొంది. జైలు వద్ద 144వ సెక్షన్ ఉందని చెప్పి పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. రేవంత్ రెడ్డి బెయిల్ కాపీ జైలుకు చేరుకుంది. బెయిల్ ఆర్డర్ కాపీలో సాంకేతిక లోపాలు ఉండడంతో రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదల కావడంలో ఓ రోజు జాప్యం జరిగింది. నిజానికి, ఆయన మంగళవారం సాయంత్రమే విడుదల కావాల్సి ఉంది.

రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో బుధవారంనాడు కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఎసిబి కోర్టులో ఇవ్వాలని స్పష్టం చేస్తూ తీర్పు కాపీని సవరించింది. తీర్పు కాపీని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఎసిబి కోర్టుకు అందించారు. ఆ తర్వాత బెయిల్ ఆర్డర్ కాపీలు తీసుకుని జైలుకు చేరుకున్నారు.
రేవంత్ రెడ్డి విడుదలవుతున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రావడంతో జైలు వద్ద సందడి చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications