డ్రామారావుకు అవగాహన లేదు, కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందో మీ నాయననడుగు కేటీఆర్: రేవంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల శ్రమను దోచుకుంటున్నాయని రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ పై రైతుల ఆవేదన కాంగ్రెస్ కు తెలుసా అంటూ కేటీఆర్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో అంతే ఘాటుగా టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ కు రిప్లై ఇచ్చారు.
కేటీఆర్ ను చూస్తే జాలేస్తుంది: రేవంత్ రెడ్డి
కేటీఆర్ ను చూస్తే జాలేస్తుంది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ విలాసవంతమైన టూర్లకు వెళ్లొచ్చి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏం చేసింది, దేశం కోసం ఏం చేసింది అంటూ డ్రామారావు ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నో చట్టాలను మార్చి రైతులకు మద్దతు ధర ఇచ్చామని, దేశంలోని ప్రధాన ప్రాజెక్టులను కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందనేది డ్రామారావుకు అవగాహన లేదు
కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందనేది డ్రామారావుకు అవగాహన లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చి, ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి రైతుల పక్షాన నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో.. కాంగ్రెస్ చేసింది ఏంటో మీ నాయన కెసిఆర్ ని అడగండి చెబుతారు అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి అయినా రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండి ఉంటారు అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
ఏడు వేల మంది రైతులను పొట్టన బెట్టుకుంది టీఆర్ఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అని విమర్శించిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వేల మంది రైతులను పొట్టన పెట్టుకుందని, బీజేపీతో కుమ్మక్కై రాజకీయ క్రీడలో రైతులను పావులుగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీస ఐకెపి సెంటర్లు కూడా పెట్టకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్న ఆయన రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామని జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తెచ్చామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసింది
దేశంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నేనని పేర్కొన్న రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్న ఆయన టిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఈ విషయం కెటిఆర్ కు తెలియకపోతే కెసిఆర్ ని అడిగి తెలుసుకోవాలని సూచించారు.