కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వచ్చేంతవరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎర్రబస్సులు తప్ప రైళ్ల గురించి తెలియదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణలో మోదీ పుట్టుకముందు నుంచే రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. తెలంగాణపై అవగాహన లేని వ్యక్తిని బీజేపీ కేంద్రమంత్రిని చేసిందని విమర్శించారు.
కిషన్ రెడ్డి ఎర్రబస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చినంత మాత్రానా రాష్ట్రమంతా అలానే ఉందనుకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్,నాంపల్లి,కాచిగూడ రైల్వే స్టేషన్లు ఆయన పుట్టుకముందే కట్టారని అన్నారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు రాష్ట్రంలో దారి మళ్లుతున్నాయని.. దాన్ని కిషన్ రెడ్డి ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్,బీజేపీ అంతర్గత సంబంధాలను ప్రజలు గమనించాలన్నారు.
ఇదో కుట్ర అన్న రేవంత్..
టీఆర్ఎస్ చేపట్టబోతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంపై రేవంత్ విమర్శలు గుప్పించారు. తాము చేసిన పాపాలను పట్టణ ప్రగతి పేరుతో మాఫీ చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసేందుకు ఇదో కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏం చేసినా అందులో రాజకీయ కోణం ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో బస్తీల్లో తిరిగి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు.
టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు 'పట్నం గోస'
టీఆర్ఎస్ పట్టణ ప్రగతి చేపడితే.. కాంగ్రెస్ పట్నం గోస పేరుతో ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తోందన్నారు. పట్నం గోస కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా చేపడితే బాగుంటుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షలు,గ్రేటర్ పరిధిలో 10 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయారని అన్నారు. హైదరాబాద్లో లక్ష ఇళ్లు ఇస్తామని చెప్పి కేవలం 108 ఇళ్లు మాత్రమే ఇచ్చారన్నారు. 20 జిల్లాల్లో ఇప్పటికీ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కేటాయించలేదన్నారు. ఈ లెక్కలు శాసనమండలి సమావేశంలో ప్రభుత్వమే చెప్పిందన్నారు.
టీఆర్ఎస్ నేతల కమీషన్ల కక్కుర్తి..
ఎర్రవల్లి,చింతమడక ప్రజలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడాన్ని.. కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. మీరు ఎర్రవల్లికి ఎంపీటీసీనా.. లేక చింతమడకు సర్పంచా అని ప్రశ్నించారు. కానీ ఈ రెండు గ్రామాలకు మాత్రమే లబ్ది చేకూర్చడాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తుందన్నారు.రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు త్వరితగతిన నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ నేతలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు రూ.900కోట్లు చెల్లించకపోవడం వల్ల ఎక్కడివక్కడ పనులు ఆగిపోయాయని ఆరోపించారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రజలను చైతన్యం చేయడానికే..
కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి హైదరాబాద్లోని జవహర్ నగర్,బండ్లగూడ,ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రజలకు కేటాయించలేదన్నారు. వాటిని ఖాళీగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఇకపై పట్నం గోస కార్యక్రమం పేరుతో హైదరాబాద్లోని ప్రతీ డివిజన్కు వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.