వారే పార్టీ వారో: ఆయనొద్దని ఈసీకి రేవంత్రెడ్డి లేఖ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగాను సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.
రేవంత్ రెడ్డి బుధవారం ఒక లేఖ పంపారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన వారో స్పష్టంగా తెలియడం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ 2011లో ఓటర్ల జాబితా ఎలా ఉండాలో ఒక ప్రొఫార్మా రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపిందని, ఈ ప్రొఫార్మా ప్రకారం ఐదో కాలమ్లో తప్పనిసరిగా ప్రతి ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారో పేర్కొనాలని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు రూపొందించి ప్రకటించే సమయంలోనే జాబితాలో ఈ వివరాలు నమోదు చేయాలని, కానీ అసెంబ్లీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే ఆ సమాచారాన్ని తొలగించి జాబితాలు ప్రకటించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తెరాసలోకి ఫిరాయించారని, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని తాము ఇచ్చిన ఫిర్యాదులు స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు.

వీరు ఏ పార్టీకి సంబంధించిన వారో ఓటర్ల జాబితాలో అధికారికంగా పెడితే టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుకు ఇంకా బలం చేకూరుతుందన్న భయంతో అసెంబ్లీ కార్యదర్శి ఆ సమాచారం తొలగించి ఆ జాబితా ప్రచురించారని, ముఖ్యమంత్రి కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ దురుద్దేశపూరితంగా అసెంబ్లీ కార్యదర్శితో కలిసి ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.
దీనిపై వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెరాస ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్న సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విధుల నుంచి తొలగించి వేరొకరిని నియమించాలని కోరారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు.
ప్రత్యేక హోదాపై గుత్తా వివరణ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దనేది తన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం కోరితే వివరణ ఇస్తానని చెప్పారు. తాను పార్టీకి, సోనియాకు విధేయుడనని చెప్పారు.
రాష్ట్ర రాజధాని మినహా రెండు రాష్ట్రాల మధ్య పోలికే లేదని, తెలంగాణ కన్నా ఏపీ అభివృద్ధి చెందింది కావడంతో ప్రత్యేక హోదా ఇవ్వొద్దని గుత్తా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన ఏపీ కాంగ్రెస్ నేతల విశ్వసనీయతను కూడా ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలని సోనియా నిర్ణయిస్తే, వారు అప్పుడు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అందువల్ల వారికి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications