కత్తులతో బెదిరించి.. తాళ్లతో కట్టేసి.. ఆర్మీ కల్నల్ ఇంట్లో దోపిడీ
సికింద్రాబాద్ లోని ఆర్మీ కల్నల్ నాయర్ ఇంట్లోకి నలుగురు దుండగులు చొరబడి నయ్యర్ కుమారుడిని కత్తులతో బెదిరించి, తాళ్లతో కట్టివేసి కిలోకు పైగా బంగారు నగలను దోచుకెళ్లారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నివసిస్తున్న ఆర్మీ కల్నల్ ఎస్.బి.నాయర్ ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. కల్నల్ నాయర్ సొంత పనిపై శుక్రవారం బెంగళూరు వెళ్లారు.
ఆయన కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అతడికి రేచీకటి ఉన్నందున ఇంటికి కాపలాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఒక సెక్యూరిటీ గార్డు లేని సమయంలో ఈ దోపిడీ జరిగింది.
నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి నయ్యర్ కుమారుడిని కత్తులతో బెదిరించి, తాళ్లతో కట్టివేసి ఇంట్లోని కిలోకు పైగా బంగారు నగలను దోచుకెళ్లారు. దోపిడీ జరిగిన తరువాత ఇంటికి కాపలా ఉండే నేపాల్ కు చెందిన సెక్యూరిటీ గార్డు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ దోపిడీ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఇంటి బయట ఉన్న సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలించి దోపిడీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.