నేటి నాయకులకు రోశయ్య జీవితం ఆదర్శం.!ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్న సీఎల్పీ నేత భట్టి.!
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రి వర్యులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన క్రమంలో తాను ప్రభుత్వ చీఫ్ విప్ గా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్య అధికార ప్రతినిదిగా రోశయ్య, అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని, రాజకీయ విలువలతో పార్టీని నడిపించిన మహా నాయకుడు అని కొనియాడారు. ఈ సమయంలో తాను ప్రదేశ్ కాంగ్రెస్ సెక్రెటరీగా రోశయ్య తో దగ్గరగా కలిసి పని చేశానని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల తొలితరం కాంగ్రెస్ నేతగా విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప రాజకీయవేత్త రోశయ్య అని మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు.
రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు లేకుండా కేవలం సైద్ధాంతికంగా మాత్రమే మాట్లాడి రోశయ్య రాజకీయాలకు వన్నె తెచ్చారని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులకు గౌరవం తెచ్చిన రోశయ్య రాష్ట్ర శాసనసభలో 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన అపర చాణక్యుడన్నారు. మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి ఆ పదవులకే ప్రతిష్ట తెచ్చిన కృషివలుడన్నారు. రాజకీయాలలో మచ్చలేని మహనాయకుడన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేసే వారికి ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. విద్యార్థి దశ నుండే ఆచార్య ఎన్.జి. రంగా గారి శిష్యుడుగా రాజకీయాలలో ప్రవేశించి విలువలు పాటిస్తూ వివాద రహితుడుగా, అజాతశత్రువుగా, సౌమ్యుడిగా, సహన శీలిగా కీర్తిని గడించారని వివరించారు. నేటి రాజకీయ నాయకులకు రోశయ్య జీవితం ఆదర్శప్రాయం అని అన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటని, వారి అకాల మరణం అత్యంత బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నాను అని భట్టి విక్రమార్క అన్నారు.