సబితమ్మ.. ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారు..!!
హైదరాబాద్: వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చక్రం తిప్పిన సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయంగా సైలెంట్ ఐపోయారు. తాజాగా సబిత లాంట బలమైన నేతల ఆవశ్యకత తెలంగాణలో ఏర్పడడంతో ఆమెను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అదిష్టానం నుండి ఒత్తడి వస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే సబిత ఇంద్రారెడ్డి ఈ సారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కి పోటీ చేసేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు చక్రం తిప్పిన సబిత..! ఇప్పుడు మళ్లీ చురుకైన పాత్ర..!
సబితా ఇంద్రారెడ్డి.. ఈ పేరుకు వైయస్ హయాంలో ఓ బ్రాండ్ ఉండేది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే కీలక నేత ఎదిగారు మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 2000 సంవత్సరంలో పీ ఇంద్రారెడ్డి మరణించడంతో చేవెళ్ల నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆమె విజయం సాధించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించి, తొలిసారి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2009లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్లో రెండో సారి స్థానం కల్పించారు.

కేసుల మరకలు..! కొన్నాళ్లు నిశ్శబ్దంలోకి వెల్లిన సబిత..!
ఈ సారి ఆమెకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ శాఖలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు సబితా ఇంద్రారెడ్డి. రాజశేఖర్ మరణానంతరం కాంగ్రెస్ నాయకులపై పలు కేసులు బయటికొచ్చాయి. అందులో భాగంగా దాల్మియా సిమెంటు కేసులో సబిత పేరును సీబీఐ చార్జిషీటులో ఏ4గా పేర్కొనడంతో ఆమె రాజీనామా చేశారు. 2013 మే 25న గవర్నర్ రాజీనామా ఆమోదించారు.అప్పటి నుంచి సబితా ఇంద్రారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన సబిత..! ఇప్పుడు ఎంపీగా పోటీ..!
విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్కు ఇప్పుడు నాయకత్వం అవసరం ఉండడంతో ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డితో చర్చలు జరిపినట్టు సమాచారం. 2019లో జరగబోయే ఎన్నికల్లో ఆమెను పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. . అయితే, ఆమె అసెంబ్లీకి పోటీ చేయడం కంటే, పార్లమెంట్కు పోటీ చేయడానికే ఇష్టపడుతున్నారనే చర్చ జరుగుతోంది.

దేశ రాజకీయాల వైపు సబితమ్మ చూపు..! అందుకే పార్లమెంటుకు..!!
ఒకవేళ సీఎం కేసీఆర్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కీలక నేతను రంగంలోకి దింపితే అప్పటి పరిస్థితిని బట్టి సబితారెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా.. లేక చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తారా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. కీలక నేత పోటీతో ఒకవేళ గెలుపు అవకాశాలు కాస్త సన్నగిల్లే అవకాశం ఉంటే, చేవెళ్ల ఎంపీగా పోటీ చేయడానికే ఆమె ప్రాధాన్యం ఇవ్వొచ్చని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశం పట్ల రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications