నగరంలో కొత్త ట్రెండ్.. 'హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్'.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరికలు..
రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ట్రెండ్ లను అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో హైదరాబాద్ నగర పరిధిలో సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. అధిక రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్ లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.
'సంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్ లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారు' అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
ఒకవేళ లాక్ తెలియకపోతే.. బాధితులు కాల్ చేసినప్పుడు 'మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం' అంటూ లేదా 'ఓనర్ వెరిఫికేషన్' పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్వర్డ్లు రాబడుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్ లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత దొంగిలించిన సిమ్ కార్డు ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లు రీసెట్ చేసి, నిధులను ఆన్ లైన్ గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారు.. అని వివరించారు.

ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తరహా నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్బుక్, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఫోన్ గ్యాలరీలో, నోట్స్ లో ఎప్పుడూ భద్రపరచుకోవద్దన్నారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్/యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయించి, http://ceir.gov.in పోర్టల్ లో ఫోన్ ను బ్లాక్ చేయాలని సూచించారు. సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.












Click it and Unblock the Notifications