చర్లపల్లి నుంచి విడుదలైన సండ్రకు షరతులు: నరేందర్ కుమారుడికీ నోటీసులు, జిమ్మీ ఎక్కడ?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి సండ్ర బెయిల్పై బయటకు వచ్చారు.
మంగళవారం ఏసీబీ కోర్టు సండ్ర వెంకట వీరయ్యకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సత్తుపల్లి నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు సండ్రకు షరతు విధించింది.
కోర్టు ఆదేశాల మేరకు సండ్ర న్యాయవాదులు రూ. 2 లక్షలను పూచీకత్తుగా చెల్లించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా వెలుగుచూసిన ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జిమ్మి ఎక్కడ? ఏసిబి ముందుకు వస్తాడా?
ఓటుకు నోటు కేసుతో ప్రమేయం ఉన్న తెలుగుదేశం పార్టీ యువనేత జిమ్మీబాబు కూడా సండ్ర వెంకటవీరయ్య దారిలోనే నడిచి ఏసిబి ముందుకు వస్తాడా? లేక ఇలాగే రహస్యంగా తిరుగుతురా? అనేది ఇక తేలాల్సి ఉంది. ఇప్పటికే జిమ్మీకి తమ ముందు హాజరుకావాలని ఏసిబి నోటీసులు జారీ చేసింది.
సండ్రవెంకటవీరయ్య కూడా ఏసిబికి చిక్కకుండా ఏపిలో కొన్ని రోజులపాటు ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏసిబికి పూర్తిగా సహకరిస్తానని చెప్పి, ఏసిబి ముందు విచారణకు హాజరయ్యారు. విచారించిన ఏసిబి, సండ్రను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది. ఆ తర్వాత సండ్రకు కోర్టు బెయిల్ లభించడంతో మంగళవారం విడుదలయ్యారు.
ప్రస్తుతం జిమ్మీ కూడా ఏసిబికి చిక్కకుండా తిరుగుతున్నారు. సండ్రలాగే జిమ్మీ కూడా ఏసిబి ముందుకు వచ్చి విచారణకు సహకరిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం జిమ్మీబాబు ఆంధ్రప్రదేశ్లో తలదాచుకున్నట్లు సమాచారం.
కాగా, ఎలాగైనా జిమ్మీని అదుపులోకి తీసుకోవాలని తెలంగాణ ఏసిబి భావిస్తోంది. సండ్రకు కూడా బెయిల్పై విడుదల కావడంతో ప్రస్తుతం ఏసిబి.. జిమ్మీపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిమ్మీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించినట్లు తెలిసింది.
వేం నరేందర్ కుమారుడికి ఏసిబి నోటీసులు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకు ఏసిబి నోటీసులు జారీ చేసింది. బుధవారం(జులై15) ఉదయం 10.30గంటలకు ఏసిబి కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఓటుకు నోటు కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాలతో కృష్ణ మాట్లాడినట్లు సమాచారం. ఇదే కేసులో జూన్ నెలలో వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఏసిబి.. ఆయనను ఒక రోజంతా విచారించి విడిచి పెట్టింది.