సీమాంధ్రుల ఓట్ల కోసం హోరాహోరీ పోరు? రంగంలోకి దిగిన చంద్రబాబు!
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే క్షేత్రస్థాయి కార్యకర్తలతో పటిష్టంగా ఉండేది. ప్రత్యేక ఉద్యమం రావడం.. ప్రజల్లో సెంటిమెంట్ ఉండటంతో టీడీపీ అభిమానులంతా తెలంగాణ రాష్ట్ర సమితివైపు మొగ్గారు. కానీ వారి మనసుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకే చోటుంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పటేల్ - పట్వారీ వ్యవస్థను రద్దుచేసి బడుగు, బలహీనవర్గాలందరికీ రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే దీనికి ప్రధాన కారణం.\

మొదటినుంచి టీడీపీవైపు మొగ్గుచూపిన సెటిర్లు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. భారతీయ జనతాపార్టీ మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్ర సమితి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. టీడీపీ మొదటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది. రెండోసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పోటీచేసింది. ఇప్పుడు పరిస్థితి మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో రెండు, మూడు తరాల నుంచి స్థిరపడిపోయిన ఆంధ్రులందరినీ సెటిలర్స్ అంటున్నారు. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపేవారు.

టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్, బీజేపీ హోరాహోరీగా పోరాడుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో నిలిచింది. ఈ మూడు పార్టీలకు టీడీపీ మీద అభిమానం చూపించే ఓటర్ల ఓట్లు అవసరమయ్యాయి. గత ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్ ఎస్ వైపు మొగ్గుచూపారు. ఈసారి కూడా వారు టీఆర్ ఎస్కే ఓటు వేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే వీరిని బీజేపీవైపు మొగ్గుచూపేలా చేయడానికి తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్రావులాంటివారిని ఉపయోగించుకోవాలని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారు.

తెలంగాణలో పోటీకి దిగబోతున్న టీడీపీ?
పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు షర్మిల పార్టీ కూడా బరిలో నిలిచే అవకాశం కనపడుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లో ఇప్పటికీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీచేయాలని పార్టీ అధినేత నిర్ణయించారు. ఈ పోరులో ప్రతి ఓటు కీలకమే. దీంతో టీడీపీ ఓట్లు చీలుస్తుందా? లేదంటే తమ అభ్యర్థులను గెలిపించుకోగలుగుతుందా? లేదంటే ఓట్లు చీలిపోయి ఎవరికి మేలు కలుగుతుంది? అనే ప్రధానాంశాలు కీలకమయ్యాయి. తాము పోటీచేయడంకన్నా టీడీపీ ఓటర్లను ఆకట్టుకోవడంపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పుడు వారందరినీ ఏ పార్టీవైపు తిప్పుకుంటే ఆ పార్టీ ఘనవిజయం ఖాయమనే అంచనాలో ఉన్నారు. టీడీపీ పోటీచేయబోతోందా? లేదంటే ఏదైనా పార్టీకి మద్దతిస్తుందా? తమ పార్టీ ఓటర్లను ఏ పార్టీకైనా మళ్లిస్తారా? లాంటి సందేహాలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications