అబ్బాయిల పక్కన కూర్చోబెట్టి...: విద్యార్థినిలతో అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుల అరెస్ట్
నల్గొండ: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. విద్యార్థినిలను వేధిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను షీ టీమ్స్ మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నాయి. అంజయ్య, శేఖర్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
జిల్లాలోని సూర్యాపేటలో ఈ ఇద్దరు టీచర్లు గత కొంతకాలంగా అమ్మాయిలను వేధిస్తున్నారు. ఇదే విషయమై అమ్మాయిలు రాత పూర్వకంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. తమను చాలాకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని చెప్పారు. దీంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరూ తమను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నిత్యం తమపై దుర్భాషలాడుతుంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మగపిల్లల పక్కన కూర్చోబెడుతున్నారని, తాము అడిగితే వాడేమీ చేయడులే అంటారని తెలిపారు.అలాగే చెంపపై కొడతారన్నారు. ఈ పాఠశాలతో తాము చదవలేమని, తమకు టీసీలు ఇచ్చి వేరే స్కూల్లో చేర్పించాలని విద్యాశాఖ అధికారికి కూడా విన్నవించారు.
చోరీ కేసులో హిజ్రాల అరెస్టు
అదిలాబాద్ జిల్లా మంచిర్యాల రైల్వే పోలీసులు మంగళవారం ఆరుగురు హిజ్రాలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో ప్రయాణీకుల నుంచి డబ్బులు కాజేసిన కేసులో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని స్టేషన్ తరలించారు.
విద్యుదాఘాతంతో ఉపసర్పంచ్ మృతి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేట గ్రామ ఉప సర్పంచ్ గోపాల రావు మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన వ్యవసాయ బావి వద్ద మోటారు ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోపాల్ రావుకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.