ఆహార ప్రియులకు షాక్: అల్ఫా హోటల్కు జరిమానా, మరికొన్ని హోటళ్లలోనూ
హైదరాబాద్: నగరంలోని పలు హోటళ్లలో ఆహార పదార్థాలను తినాలంటే వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే, సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటళ్లలో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించలేదని గుర్తించడం గమనార్హం.
రెండు రోజలు క్రితం తనిఖీలు నిర్వహించిన అధికారులు గురువారం వాటికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేగాక, తయారు చేసిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్క్రీమ్ వంటివి ఎక్స్పైరీ డేట్ లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు. కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రోజుకూ వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతుంటారు. దీంతో స్థానికంగా పెద్ద హోటల్ గా పేరున్న ఆల్ఫా హోటల్ లోనే యువతతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికే వస్తుంటారు.
ఆ హోటల్లో విక్రయించే బేకరీ వస్తువులు, బిర్యానీ తినడానికి మక్కువ ఇష్టపడుతుంటారు. అందుబాటు ధరకు టేస్టీ ఫుడ్ దొరుకుతుందన్న భావనతో ఎప్పుడు వెళ్లినా అక్కడ రద్దీగానే ఉంటుంది. అయితే, వినియోగదారులకు రుచితోపాటు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాల్సిన హోటల్ యాజమాన్యం మాత్రం వాటిని నిర్లక్ష్యం చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో విస్తుపోయే విషయాలు వెల్లడవడంతో ఆల్ఫా హోటల్ కు వచ్చే వినియోగదారులు బెంబేల్తిపోతున్నారు.
మరోవైపు, ఈ హోటల్తో పాటు సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంటశాలను గుర్తించారు. అంతేగాక, హోటళ్లలో ఎలుకలు తిరుగుతూ ఉండటం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని వెల్లడించారు. ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications