చివరి నిమిషంలో కేసీఆర్ ఊహించని షాక్, కేటీఆర్కు కొత్త చిక్కులు!
కరీంనగర్: సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ అఖిల పక్షం నేతలు, లాయర్లు చేపడుతున్న ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతోంది. సిరిసిల్ల నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావు గెలిచారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటిస్తారని తొలుత వార్తలు వచ్చాయి.
ఇప్పుడు దానిపై వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనల వ్యక్తమవుతున్నాయి. గురువారం నాడు ఉద్యమకారులు బంద్ నిర్వహించారు. పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని మరికొంతమంది పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కొందరు బీజేవైఎం నాయకులు నీళ్ల ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.
సిరిసిల్లను జిల్లాగా చేస్తామని చెప్పి ఆఖరి నిముషం వరకు చెప్పి, చివరకు ఉసూరుమనిపించారని మండిపడుతున్నారు. కరీంనగర్ జిల్లాను మూడు భాగాలుగా... కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి.

అయితే, సిరిసిల్ల బదులు పెద్దపల్లి జిల్లా అయింది. దీంతో సిరిసిల్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార తెరాస పార్టీ నేతలతో పాటు విపక్షాలు, పలు జేఏసీ సంఘాలు, ఉద్యోగులు.. విద్యార్థులు, మహిళలు.. ఇలా అందరు రోడ్డు మీదకు వస్తున్నారు. విపక్ష నేతలు కేటీఆర్ పైన కన్నెర్ర చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా ఆలోచన అసలు స్థానికంగా మొదట లేదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆరే సిరిసిల్ల జిల్లా ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని, సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయవలసిందిగా ఆదేశించారని, కేటీఆర్ జోక్యం వల్లే సిరిసిల్ల జిల్లా అవుతోందని తెరాస నేతలు చెప్పారని, ఇప్పుడు అది బూమరాంగ్ అయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications