నయీం కేసులో కొత్త కోణాలు: లీడర్ల ఫోటోలు, ప్లాన్.. కారెక్కి ఫోన్లు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నయీం కేసుల దర్యాప్తులో డాక్యుమెంట్లు, నగదు, ఆయుధాలు ఒక ఎత్తయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ మరో ఎత్తుగా మారింది. టచలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయులు.. ఇలా అందరి వివరాలనూ, వారి లావాదేవీలనూ నయీం డైరీలో రాసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
డైరీపై దృష్టి
సిట్ బృందం ఇప్పుడు డైరీపై దృష్టి సారించింది. నయీంతో లావాదేవీలు జరిపిన పోలీసులు, రాజకీయ ప్రముఖులు నయీం కేసుల దర్యాప్తు లో పరిణామాలను ఎప్పటికప్పుడు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖుల మధ్య ఇప్పుడు.. నయీంతో టచ్లో ఉన్నది ఎవరు.. అనే చర్చ జోరుగా సాగుతోంది.
నాయకులతో ఫోటోలు
హైదరాబాద్, నల్లగొండ, షాద్నగర్లోని నయీం, కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోటోలు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. తాను అధికారులు, రాజకీయ నేతలతో పార్టీలు నిర్వహించిన సమయంలో నయీం ఫోటోలు తీయించి భద్రపరిచాడు. ఫోటోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు సైతం నయీం పార్టీలో పాల్గొన్న ఫోటోలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోజురోజుకూ వేగం పుంజుకుంటున్న సిట్ దర్యాప్తులో ఏ రోజు ఏ పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందోనని నయీంతో సంబంధాలు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, సిట్ అధికారులు పిల్లల వాంగ్మూలం తీసుకున్నారు.
నయీం సేవలో..
నయీం దందాలకు అనేక మంది రాజకీయ నాయకులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా యాదగిరిగుట్టకు చెందిన అధికార పార్టీ నాయకుడొకరు నయీంకు అత్యంత సన్నిహితుడన్న వార్తలు వస్తున్నాయి. స్థానికంగా కూడా చాలా మందికి ఈ విషయం తెలుసునని అంటున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి కూడా నయీం మనిషిగానే చలామణి అవుతున్నారట. వీరిద్దరూ భాయ్సాబ్ అని పేరు చెప్పి స్తలాలను కబ్జా చేసేవారని విమర్శలు వస్తున్నాయి. కబ్జా చేసే వాటిలో కొంత వారు ఉంచుకొని, మిగతా దానిని నయీంకు ఇచ్చేవారని తెలుస్తోంది.
చాలామంది నాయకులు నయీం సేవలో తరించేవారని, ఇందులో ఎంపీపీలు, సర్పంచులు మొదలు ఉన్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. చాలామంది నయీం పేరు చెప్పి సెటిల్మెంట్లకు కూడా పాల్పడేవారని తెలుస్తోంది.. బాధితులు ముందుకొచ్చి, ఫలానా ప్రజాప్రతినిధి తమ స్థలం గుంజుకున్నారని ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్య తీసుకుంటామని అధికారులు అంటున్నారు.
కారెక్కాల్సిందే
ఇంట్లో ఉన్నప్పుడు నయీం ఎవరితోనూ ఫోన్లో మాట్లాడేవాడు కాదని తెలుస్తోంది. తన ఫోన్ నంబరును బట్టి పోలీసులు తానున్న ఇంటిని గుర్తిస్తారనే భయంతోనే ఇలా వ్యవహరించేవాడట. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ముందు కారెక్కేవాడు. యథావిధిగా తన పక్కన చిన్నపిల్లల్ని, మహిళలను కూర్చోబెట్టుకునేవాడు.
ఇంటి నుంచి ఔటర్ రింగ్రోడ్డు, బెంగళూరు హైవే, లేదంటే విజయవాడ హైవేపై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టేవాడని తెలుస్తోంది. ఒక వ్యక్తితో ఒక నంబర్తో, మరొకరితో మరో నంబర్తో మాట్లాడేవాడని, తాను ఎక్కడున్నదీ పోలీసులకు తెలియకుండా ఉండేందుకే ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది.